Advertisement

  • ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాల విషయంలో ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాల విషయంలో ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

By: Sankar Wed, 17 June 2020 8:43 PM

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాల విషయంలో ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్



కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు పెంచాలని మూడు వారాలుగా చెబుతూనే ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా చికిత్సలు గాంధీకే పరిమితం చేశారని.. నిమ్స్ వంటి ఆస్పత్రులను ఎందుకు వినియోగించడం లేదని ప్రశ్నించింది. వైద్య సిబ్బందికి తగిన కరోనా నివారణ కిట్లు ఇవ్వడం లేదన్న పిల్‌పై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. పీపీఈ కిట్లు, మాస్కులు ఎన్ని వచ్చాయి? సిబ్బందికి ఎన్ని ఇచ్చారో నివేదికలు సమర్పించాలని ఆదేశించింది.

ఇందుకు సంబంధించిన వివరాలను రేపటిలోగా సమర్పించాలని గాంధీ, నిమ్స్, ఫీవర్, కింగ్ కోఠి ఆస్పత్రుల సూపరింటెండెంట్‌లకు ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా.. గాంధీలో జూనియర్‌ డాక్టర్ల సమ్మె అక్కడి పరిస్థితికి అద్దం పడుతోందని.. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, గాంధీ సూపరింటెండెంట్ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది

ఇక రాష్ట్రంలోని 33 జిల్లాలకు కరోనా విస్తరించిందని ఆందోళన వ్యక్తం చేసిన హైకోర్టు.. కరోనా నియంత్రణపై ప్రభుత్వానికి ఆసక్తి, ఉత్సాహం పోయినట్లు కనిపిస్తోందని చురకలు అంటించింది. కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఇంటింటికీ పరీక్షలు ఎందుకు నిర్వహించడం లేదు... పరీక్షలు చేయకుంటే కరోనా వ్యాప్తి తీవ్రత ఎలా తెలుస్తుందని ప్రశ్నించింది. మీడియా బులెటిన్లలో కరోనా గణాంకాలు గజిబిజిగా ఉంటున్నాయని.. కరోనాను ఎదుర్కొనే సన్నద్ధత తగినంతగా కనిపించడం లేదని మండిపడింది. తమ ఆదేశాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని.. తాము మరింత కఠినంగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటే.. అలాగే చేస్తామని వ్యాఖ్యానించింది. ప్రజలే ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవాలన్న ధోరణి ప్రభుత్వంలో కనిపిస్తోందని అసహనం వ్యక్తం చేసింది.


Tags :
|

Advertisement