తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
By: chandrasekar Fri, 05 June 2020 12:59 PM
తెలంగాణలోని
గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రిలో పలువురు వైద్యులు, వైద్య విద్యార్థులు, వైద్య సిబ్బంది కరోనా మహమ్మారి బారినపడిన విషయం
తెలిసిందే. అయితే, ఈ విషయంపై
హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనావైరస్ వ్యాధి
బారినపడిన రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులకు పీపీఈ కిట్లు ఇచ్చినప్పటికీ వారికి
కరోనా ఎలా సోకిందో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
రాష్ట్రంలో కరోనా
వ్యాప్తి, పరీక్షల
నిర్వహణఫై విశ్రాంత డీఎంహెచ్ఓ రాజేందర్, విశ్రాంత ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, మరికొంత మంది దాఖలు చేసిన 7 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి
జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయసేన్
రెడ్డి కూడిన ధర్మాసనం గురువారం విచారించింది.
ప్రభుత్వ
ఆస్పత్రుల్లో సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజులు సరఫరా
చేయాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని న్యాయవాది
చిక్కుడు ప్రభాకర్ కోర్టుకు తెలిపారు. ఉస్మానియా, నిమ్స్ తదితర ఆస్పత్రుల్లోని 37 మంది వైద్యులు, వైద్య విద్యార్థులకు కరోనా సోకిందని కోర్టుకు
వివరించారు.
ఈ క్రమంలో వైద్య
సిబ్బంది అందరికీ కరోనా రక్షణ కిట్లు ఇచ్చినట్లు గతంలో ప్రభుత్వం నివేదించిందన్న
హైకోర్టు అలాంటప్పుడు వైద్యులకు కరోనా ఎలా వచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఎవరి ద్వారా వైద్యులకు కరోనా సోకిందో నిర్ధారించారా? అని నిలదీసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో
జూన్ 8వ తేదీలోగా నివేదిక
సమర్పించాలని ప్రభుత్వాన్నికోర్టు ఆదేశించింది.