తెలంగాణ సర్కారుకు హైకోర్టు కీలక సూచనలు
By: chandrasekar Sat, 20 June 2020 4:50 PM
కొద్ది రోజులుగా మాయదారి
రోగానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు పలు సూచనలు
చేయటం తో పాటు కొన్నిసార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో
తగినన్ని నిర్దారణ పరీక్షలు నిర్వహించటం లేదని వైద్యులకు తగినన్ని రక్షణ పరికరాలు
అందుబాటులో లేవంటూ దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాఖ్యాలపై ప్రధాన న్యాయమూర్తి
జస్టిస్ ఆర్ ఎస్ చౌహాన్ జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డిలతో కూడి విచారణ చేపట్టింది.
ఈ విచారణకు ప్రజారోగ్య
శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావుతో పాటు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు
వీడియోకాన్ఫరెన్సులో హాజరయ్యారు. ఈ సందర్భంగా గాంధీ ఆసుపత్రిలో పీపీఈ కిట్ లు ఎన్95
మాస్కుల కేటాయింపుతో పాటు 274 మంది పోలీసులతో వైద్యులకు వైద్య సిబ్బందికి
కల్పిస్తున్న చర్యల గురించి వివరించారు.
వీరు చెప్పిన వివరాలతో
పాటు న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ సర్కారుకు
పలు సూచనలు చేసింది. గాంధీ ఆసుపత్రితో పాటు కొవిడ్ ఆసుపత్రులుగా గుర్తించిన వాటి
జాబితాను ప్రచురించాలి. కేరళ
అనుసరిస్తున్నట్లుగా ఆర్ టీ – పీసీఆర్ పరీక్షల్ని నిర్వహించటానికి ఉన్న
ఇబ్బందులేమిటి? ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే నివేదిక ఇవ్వండి. కరోనా
నిర్దారణ పరీక్షల సంఖ్య పెంచాలి. యాంటిజెన్
టెస్టింగ్ కిట్స్ ను వినియోగించాలి. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం పరీక్షల్ని
నిర్వహించాలి. పాజిటివ్ కేసులకు సంబంధించిన సమాచారాన్ని రోజూ ప్రకటించాలి. కేవలం మీడియా బులెటిన్ లకే పరిమితం కావొద్దు.
అన్ని ప్రాంతీయ వార్తా
పత్రికల్లో ప్రచురించాలి. జీహెచ్ఎంసీ వార్డుల వారీగా కేసుల వివరాల్ని ప్రకటించాలి.
కాలనీ సంఘాలకు తెలియజేయాలి. గాంధీ ఆసుపత్రిలో మాదిరి మాయదారి రోగానికి చికిత్స
అందించే ప్రైవేటు ఆసుపత్రులు కూడా ప్రతిరోజు సగం మంది వైద్య సిబ్బందితో పని
చేయించేలా ప్రభుత్వం సూచన చేయాలి. గాంధీతో సహా కొవిడ్ ఆసుపత్రులకు పోలీసు భద్రత
కల్పించాలి.