ఏపీలో దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ
By: chandrasekar Tue, 18 Aug 2020 4:02 PM
ఆంధ్ర ప్రదేశ్ లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సీనియర్ లాయర్ శ్రవణ్ కుమార్ పిల్ దాఖలు చేయగా హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా లాయర్ శ్రవణ్ కుమార్ తన వాదనల్ని వినిపించారు. ప్రతి జడ్జి కదలికల్ని పోలీసులతో పర్యవేక్షిస్తున్నారని దీని కోసం ప్రత్యేకంగా ఓ పోలీస్ అధికారిని నియమించారని కోర్టుకు వివరించారు.
దీనిపై స్పందించిన హైకోర్టు ఆధారాలు ఉంటే సమర్పించాలని పిటిషనర్ను ఆదేశించింది. అదనపు సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేస్తానని శ్రవణ్ చెప్పారు. ఇటు ప్రభుత్వంతో పాటూ సర్వీస్ ప్రొవైడర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే తాము విచారణకు ఎందుకు ఆదేశించకూడదని అడ్వకేట్ జనరల్ని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ నెల 20కు తదుపరి విచారణను వాయిదా వేశారు.