బక్రీద్ జంతువధ నిబంధనల ప్రకారమే జరగాలి ..హైకోర్టు
By: Sankar Thu, 30 July 2020 5:55 PM
బక్రీద్ సందర్భంగా అక్రమ జంతు వధ చేస్తే చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా అక్రమంగా జంతువుల రవాణా లేదా వధ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. ఒంటెల అక్రమ రవాణా, వధ నిరోధించాలని డాక్టర్ శశికళ దాఖలు చేసిన కేసుపై విచారణ నేపథ్యంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఆదేశాలతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జంతు వధ కేంద్రాలను తనిఖీ చేసినట్టు తెలిపిన ప్రభుత్వం..రెండు కేసులు నమోదు చేసినట్లు పేర్కొంది.
నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించకూడదంటూ పేర్కొన్న హైకోర్టు.. జంతు వధ నిబంధనల ప్రకారమే జరగాలని స్పష్టం చేసింది. జంతు మాంసం ద్వారా వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని.. చైనాలో గబ్బిలాలు తినడం ద్వారా కరోనా వచ్చిందన్న ప్రచారాన్ని గుర్తుచేసింది. మాంసం దుకాణాలను జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పుడైనా తనిఖీలు చేశారా అని ప్రశ్నించింది. రెండు వారాల్లో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అయితే ముస్లింలు ఇప్పటికే రంజాన్ నెల ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాస దీక్షల విరమణ, తవారీతో పండగ ప్రార్థనలన్నీ ఇళ్లలోనే జరుపుకున్నారు. ప్రతి ముస్లింకు ఖుర్బానీ తప్పనిసరి. బక్రీద్ ఖుర్బానీలు అత్యధికంగా పాతబస్తీలోనే కనిపిస్తాయి. ప్రతి ఇంటా కనీసం ఒక ఖుర్బానీకి తగ్గకుండా రెండు నుంచి నాలుగు ఖుర్బానీలు ఇస్తుంటారు. ప్రతి ఖుర్బానీలో మూడు భాగాలు చేసి అందులో ఒక భాగం బంధువులకు, మరో భాగం ఇరుగుపొరుగు వారికి పంపిణీ చేస్తారు. మిగిలిన భాగాన్ని ఇంట్లో వినియోగించుకుంటారు.
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఖుర్బానీ మాంసం పంపిణీ కూడా అంత సునాయాసం కాదన భావన వ్యక్తమవుతోంది. ఖుర్బానీ మాంసం స్వీకరించే వారు సైతం సంశయించే పరిస్థితి లేకపోలేదు. ఫలితంగా ప్రతి కుటుంబంలో ఖుర్బానీల సంఖ్య తగ్గి ఇంటికే పరిమితమయ్యే అవకాశాలుండొచ్చు.