కరోనా వైరస్ కు మరొక కొత్త లక్షణం వచ్చి చేరింది ..
By: Sankar Wed, 12 Aug 2020 8:32 PM
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారికి చెక్
పెట్టడానికి ఓ వైపు ముమ్మరంగా ప్రయోగాలు జరుగుతుంటే.. మరోవైపు ఈ వైరస్
కొత్త కొత్త లక్షణాలతో పంజా విసురుతోంది. దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో
ఇబ్బంది, గొంతు తడారిపోవడం, తలనొప్పి, కండరాల నొప్పి లాంటివి కరోనా
లక్షణాలుగా తొలుత పేర్కొన్నారు. ఆ తర్వాత కళ్లు ఎర్రబారడం కూడా ఒక లక్షణమని
చెప్పారు. ఆ తర్వాత కొన్ని రోజులకు రుచి, వాసన శక్తిని కోల్పోవడ కూడా
కొవిడ్ లక్షణాలుగా పేర్కొన్నారు. తాజాగా ఈ జాబితాలో మరో అంశం చేరింది.
ఆపకుండా ఎక్కిళ్లు రావడం కూడా కరోనా లక్షణం అయుండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
అమెరికా
శాస్త్రవేత్తలు ఈ అంశంపై ప్రయోగాలు చేస్తున్నారు. అమెరికన్ జర్నల్ ఆఫ్
ఎమర్జెన్సీ మెడిసిన్లో ఇందుకు సంబంధించిన వివరాలను ప్రచురించారు. అందులో
పేర్కొన్న వివరాల ప్రకారం.. చికాగోకు చెందిన 62 ఏళ్ల ఓ వ్యక్తికి ఆపకుండా
ఎక్కిళ్లు వచ్చాయి. నాలుగు రోజులుగా ఎక్కిళ్లు వస్తుండటంతో ఆయన చికిత్స
కోసం హాస్పిటల్కు వచ్చారు.
బాధితుడికి పరీక్షలు జరుపగా.. ఆయనలో
ఎక్కిళ్లు తప్ప ఎలాంటి ఇతర లక్షణాలు కనిపించలేదు. అయితే.. కొంత కాలంగా ఆయన
షుగర్, బీపీకి మాత్రలు మాత్రం వాడుతున్నారు. అంతే తప్ప.. ఆయనకు జ్వరంగానీ,
దగ్గు గానీ ఇతర ఏ లక్షణాలు లేవు. పలు పరీక్షలు నిర్వహించిన వైద్యులు
ఎక్కిళ్లు తగ్గడానికి ఆయనకు కొన్ని మందులు సూచించారు. అయితే.. అవేవీ
పనిచేయలేదు.
48 గంటలు గడిచినా ఎక్కిళ్లు ఆగకపోయేసరికి వైద్యులు
కరోనా పరీక్షలు జరిపించారు. ఈలోగా ఆయనకు జ్వరం మొదలైంది. అటు ఫలితాల్లో
పాజిటివ్గా తేలింది. దీంతో వైద్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. బాధితుడిలో
ఇతర సమస్యలేవీ లేకపోవడం వల్ల ఆయనకు ఆపకుండా ఎక్కిళ్లు రావడానికి కొవిడ్-19
కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.