Advertisement

  • "హెటిరో" కంపెనీ కరోనాను కట్టడిచేసే రెమ్డిసివిర్‌ ఔషధం ఆవిష్కరణ

"హెటిరో" కంపెనీ కరోనాను కట్టడిచేసే రెమ్డిసివిర్‌ ఔషధం ఆవిష్కరణ

By: chandrasekar Mon, 22 June 2020 10:19 AM

"హెటిరో" కంపెనీ కరోనాను కట్టడిచేసే రెమ్డిసివిర్‌ ఔషధం ఆవిష్కరణ


కరోనా వైరస్ నిర్మూలనకు సరైన వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలన్నీ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముంబయికి చెందిన గ్లెన్మార్క్ అనే ఫార్మా కంపెనీ ఫాబిఫ్లూ బ్రాండ్ పేరుతో మందు బిళ్లలు తయారు చేసినట్లుగా ప్రకటించింది. అయితే, తక్కువ రోగ లక్షణాలు ఉన్నవారికి ఈ ఔషధం పని చేస్తుందని పేర్కొంది. హైదరాబాద్‌కు చెందిన జెనెరిక్‌ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ హెటిరో కరోనాను కట్టడిచేసే రెమ్డిసివిర్‌ ఔషధాన్ని ఆవిష్కరించింది. ‘కోవిఫర్‌’ ఇంజెక్షన్‌ పేరుతో దీన్ని మార్కెట్‌లోకి విడుదల చేసింది.

ఈ మేరకు క‌రోనా పోరాటంలో హెటిరో ఆదివారం కీల‌క ప్రకట‌న చేసింది. కరోనా పై పోరాటంలో భాగంగా ఇన్వెస్టిగేష‌న్ యాంటీ వైరల్ మెడిసిన్ (రెమ్డిసివిర్) ఉత్పత్తి, మార్కెటింగ్ కోసం డ్రగ్ కంట్రోల‌ర్ జన‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) తాము అనుమ‌తి పొందిన‌ట్లు వెల్లడించింది. కరోనా కోసం తాము తయారు చేసిన ఔషధం ‘కోవిఫర్’ అనే పేరుతో భార‌త‌దేశంలో మార్కెట్లోకి రానున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ ఇంజెక్షన్లను లక్ష డోసుల మేర సిద్ధం చేశామని సోమవారం నుంచి దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటాయని హెటిరో సంస్థ వెల్లడించింది.

హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ డాక్టర్ బి.పార్థసార‌థి మాట్లాడుతూ "దేశంలో కరోనా కేసులు పెద్ద ఎత్తున పెరుగుతున్న త‌రుణంలో తాము తయారు చేసిన ‘కోవిఫ‌ర్‌’ ఔషధం విజ‌య‌వంత‌ంగా క్లినిక‌ల్ ట్రయ‌ల్స్ పూర్తి చేసుకొని అందుబాటులోకి రానుంది. ప్రస్తుత అవ‌స‌రాల‌కు త‌గినట్లు ఉత్పత్తులు అందించేందుకు సిద్ధమ‌వుతున్నాం. వైరస్‌పై పోరాటంలో భాగంగా ప్రభుత్వం, వైద్య సిబ్బందితో మేం నిరంత‌రం క‌లిసి ప‌నిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం.’’ అని ప్రకటించారు.

కోవిఫ‌ర్ ఇంజక్షన్ మందు 100 మిల్లీగ్రాముల చొప్పున ఇంజెక్షన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. వైద్యుల ప‌ర్యవేక్షణ‌లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి దీనిని అందించాలని సంస్థ ప్రకటించింది.

Tags :
|

Advertisement