తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు...రాకపోకలు తీవ్ర అంతరాయం...రెడ్ అలర్ట్
By: chandrasekar Wed, 14 Oct 2020 10:14 AM
తెలుగు రాష్ట్రాల్లో
భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో ముఖ్యంగా కృష్ణా, గోదావరి
జిల్లాల్లో వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు
కురుస్తున్నాయి. దీంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. తెలంగాణలో కురుస్తున్న వర్షాల
వల్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రయాణాలు ప్రమాదకరంగా మారాయి.
హైదరాబాద్ - విజయవాడ, భువనగిరి - చిట్యాల, నార్కట్పల్లి - అద్దంకి
హైవేలపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. రోడ్లన్నీ జలమయం కావడం వల్ల ఏపీ, తెలంగాణ
మధ్య రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. ఏపీ, తెలంగాణ సరిహద్దుల వద్ద కిలో మీటర్ల మేర వాహనాలు
నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ట్రాఫిక్లో నరకయాతన పడుతున్నారు. చౌటుప్పల్ ఎల్లగిరి వద్ద జాతీయ రహదారిపై వరద నీరు ఉధృతంగా
ప్రవహిస్తోంది.
భువనగిరి (మం)
నాగిరెడ్డిపల్లి వద్ద వరద ఉధృతికి ముగ్గురు గల్లంతయ్యారు. చిట్యాలలో రైల్వే
బ్రిడ్జ్ వద్ద జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. దీని వల్ల వాహనాలు నీట
మునుగుతున్నాయి. వెలిమినేడు అండర్ పాస్ బ్రిడ్జ్పై నుంచి భారీగా వరద నీరు
లీకవుతున్నాయి. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు.
దారి మళ్లించేందుకు కూడా వీల్లేకుండా వరద నీటితో రహదారులన్నీ మునిగాయి. రోడ్డును
అంచనా వేయకుండా ఎట్టిపరిస్థితుల్లోనూ వరద దాటవద్దని వాహనదారులకు పోలీసులు
హెచ్చరించారు. రోడ్లన్నీ జలమయమైన నేపథ్యంలో ప్రజలు ప్రయాణాలు తాత్కాలికంగా వాయిదా
వేసుకోవడం మంచిదని పలువురు అంటున్నారు.