వచ్చే రెండు రోజుల్లో తెలంగాణలో ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన
By: Sankar Sat, 26 Sept 2020 4:05 PM
తెలంగాణను వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వరదలతో రాష్ర్టంలోని అన్ని జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. మరో రెండు, మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ నెల 28న ఉమ్మడి మహబూబ్నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ మధ్య కర్ణాటక వరకు ఉపరిత ద్రోణి కొనసాగుతోంది. తెలంగాణ, రాయలసీమ మీదుగా 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇవాళ అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, మేడ్చల్ జిల్లాలో జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని, అధికారులకు సెలవులు రద్దు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ను సీఎం ఆదేశించారు. దీంతో సోమేశ్ కుమార్ సెలవులు రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. జిల్లా కలెక్టర్లతో పాటు ఉన్నతాధికారులు హెడ్ క్వార్టర్స్లోనే ఉండాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.