రాబోయే మూడు రోజుల్లో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు...
By: chandrasekar Tue, 20 Oct 2020 7:24 PM
గత వారం నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
లో కురుస్తున్న భారీ వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటికీ చాలా
ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన
వర్షాలు, పోటెత్తిన
వరదలతో హైదరాబాద్ సైతం అతలాకుతలమై భారీగా నష్టపోయి౦ది. మంగళవారం ఉదయం 8.30గంటలకు
మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణశాఖ వెల్లడించి౦ది. అల్పపీడనానికి అనుబంధంగా 7.6
కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాగల 48
గంటల్లో ఉపరితల ఆవర్తనం వాయువ్య దిశగా ప్రయాణిస్తుందని వాతవరణ శాఖ తెలిపింది. ఇది
మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఈ అల్పపీడన ప్రభావంతో
రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ తో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా అక్కడక్కడ మోస్తరు
నుంచి తేలికపాటి వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ
అధికారులు వెల్లడించారు. ఈ అల్పపీడనంతో తీరం వెంబడి గంటకు 40 నుంచి
50
కిలోమీటర్లు కొన్నిసార్లు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని
వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కావున మత్స్యకారులు చేపల వేటకోసం సముద్రంలోకి
వెళ్లొద్దంటూ హెచ్చరికను సైతం జారీ చేశారు. ఇదిలాఉంటే ఇప్పటికే కురిసిన వర్షాలతో
అతలాకుతలమైన హైదరాబాద్ నగరంలో మంగళవారం మధ్యాహ్నం కూడా వర్షం కురిసింది. తాజాగా
ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ నగరం మరోసారి వరదలతో నష్టపోయే అవకాశముందని
పలువురు ఆందోళన చెందుతున్నారు.