దేశవ్యాప్తంగా రానున్న 3 రోజులు భారీ వర్షాలు
By: chandrasekar Tue, 01 Sept 2020 6:49 PM
ఉత్తర భారతం, ఈశాన్యం, దక్షిణ భారత్లో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు భారతీయ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆగస్టు నెలలో సాధారణం కన్నా 27 శాతం అధిక వర్షం నమోదు అయినట్లు ఐఎండీ తెలిపింది. గత 120 ఏళ్లలో ఇలా వర్షాలు కురవడం ఇది నాలుగవ సారి కాగా, గత 44
ఏళ్లలో ఇదే మొదటిసారి అని ఐఎండీ చెప్పింది. దేశవ్యాప్తంగా జూన్ ఒకటవ తేదీ నుంచి ఆగస్టు 31
వరకు సాధారణం కన్నా 10 శాతం అధికంగా వర్షం కురిసినట్లు ఐఎండీ అంచనా.
ఉత్తర భారతం, ఈశాన్య భారతం, దక్షిణ భారత్ ప్రాంతాల్లో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తన వార్నింగ్లో తెలిపింది. రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో మంగళవారం భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ఛాన్సు ఉన్నట్లు చెప్పింది. పంజాబ్, ఈస్ట్ రాజస్థాన్, బీహార్, వెస్ట్ బెంగాల్, సిక్కిం, ఒడిశా, అస్సాం, మేఘాలయా, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కువరనున్నాయి. రాయలసీమ, ఆంధ్రప్రదేశ్, కోస్తా, కర్నాటక, తమిళనాడు, పుదుచ్చరి, కరైకల్, కేరళ, మాహే ప్రాంతాల్లోనూ ఇవాళ కుండపోత వానలు కురుస్తాయి. దక్షిణ అరేబియా సముద్రంలో బలమైన ఈదురుగాలులు వీయనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది.