Advertisement

రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

By: Sankar Tue, 20 Oct 2020 09:17 AM

రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన


ఇప్పటికే భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు వాతావారణ శాఖ మరో హెచ్చరిక జారీచేసింది. రానున్న 4- 5 గంటల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు.. నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని పేర్కొంది. ఇక విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు విపత్తులశాఖ కమిషనర్‌ కన్నబాబు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

ప్రజలంతా బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ తాజా హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరింత అప్రమత్తం అయ్యింది. వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమయ్యింది..

మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న రెండ్రోజులపాటు రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. మధ్య బంగాళా ఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో 5.8 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

ఆ ప్రభావంతో మధ్య బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా మారనుందని, దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ అలర్ట్‌ జారీ చేసింది.

Tags :

Advertisement