కరోనా విషయంలో భారత్ కు ఊరట ..మరణాలు కేవలం 1.58 శాతం మాత్రమే
By: Sankar Tue, 25 Aug 2020 10:52 PM
కొవిడ్-19తో పోరాడుతూ 1.92% మంది రోగులు ఐసీయూలో ఉండగా, 2.70 శాతం ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్నారని, 0.29 శాతం మంది వెంటిలేటర్పై ఉన్నారని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 60,975 తాజా కేసులు నమోదయ్యాయని, 848 మంది మరణించారని వివరించింది.
దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 31 లక్షలను దాటిందని తెలిపింది. దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య 31,67,324 కు పెరిగిందని వెల్లడించింది. వీటిలో 7,04,348 క్రియాశీల కేసులున్నాయని పేర్కొంది. అలాగే, 24,04,585 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా ఈ మహమ్మారి వల్ల 58,390 మంది చనిపోయినట్లు ప్రకటించింది.
ప్రపంచంలోనే అత్యల్పంగా భారత్లో కరోనా వైరస్ మరణాల రేటు 1.58 శాతానికి తగ్గిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో యాక్టివ్ కేసులు 6400 మేర తగ్గాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ పేర్కొన్నారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో కేవలం 22 శాతమే యాక్టివ్ కేసులున్నాయని, రికవరీ రేటు 75 శాతం దాటిందని ఆయన వెల్లడించారు