సరిహద్దుల్లో అత్యంత శక్తివంతమైన సైనికుడిని కాబట్టే తనకు అక్కడ సీటు కేటాయించారు
By: chandrasekar Fri, 14 Aug 2020 8:25 PM
సచిన్ పైలట్ రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్తో భేటీ
అయిన మరుసటి రోజు శుక్రవారం అసెంబ్లీలో తనకు కేటాయించిన సీటుపై ఆసక్తికర వ్యాఖ్యలు
చేశారు. రాజస్తాన్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ముఖ్యమంత్రి గహ్లోత్కు దూరంగా
విపక్షాలకు దగ్గరగా పైలట్కు సీటు కేటాయించడం చర్చనీయాంశమైంది.
అయితే తనకు ప్రతిపక్షాలకు
సమీపంలో సీటు కేటాయించడంపై పైలట్ తనదైన శైలిలో స్పందించారు. తనకు బోర్డర్లో సీటు
కేటాయించడం, విపక్షాల పక్కనే తాను కూర్చుండటం అందరిలో ఆసక్తి
రేపుతోందని అన్నారు. సరిహద్దుల్లో అత్యంత శక్తివంతమైన సైనికుడినే మోహరిస్తారు
కాబట్టే తనకు అక్కడ సీటు కేటాయించారని పైలట్ వ్యాఖ్యానించారు.
రాజస్తాన్ ప్రత్యేక
అసెంబ్లీ సమావేశాల్లో గహ్లోత్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని
విపక్ష బీజేపీ ప్రకటించగా, పైలట్ రాకతో బలోపేతమవడంతో తామే విశ్వాస తీర్మానాన్ని
ప్రవేశపెట్టాలని గహ్లాత్ శిబిరం యోచిస్తోంది.
200 మంది సభ్యులు కలిగిన రాజస్తాన్ అసెంబ్లీలో
మెజారిటీకి 101 మంది సభ్యులు అవసరం కాగా, కాంగ్రెస్
పార్టీకి 107 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇండిపెండెంట్లు, చిన్నపార్టీల
ఎమ్మెల్యేలు కలుపుకుని ఆ పార్టీకి 125 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇక విపక్ష బీజేపీకి 72 మంది
ఎమ్మెల్యేలున్నారు.