నెక్లెస్ రోడ్ అభివృద్ధి పనులను పరిశీలించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు
By: chandrasekar Mon, 29 June 2020 2:40 PM
కోమటి చెరువు- నెక్లెస్
రోడ్డు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర ఆర్థిక శాఖ
మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట కోమటి చెరువు సుందరీకరణ
పనులు, నెక్లెస్
రోడ్ అభివృద్ధి పనులను ఆదివారం సాయంత్రం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
నెక్లెస్ రోడ్ పనులను
మూడు రీచ్ లుగా విభజన చేయడం జరిగిందని, మూడు రీచ్ లలో చేపట్టిన నెక్లెస్ రోడ్డు సుందరీకరణ
పనులకు గానూ, మొదటి రీచ్ 600 మీటర్లు మూడు నెలల్లో బతుకమ్మ పండుగలోపు
అందుబాటులోకి తేవాలని అధికారులు, కాంట్రాక్టరును మంత్రి ఆదేశించారు. రెండవ రీచ్ పనులు
ముమ్మరం చేయాలని మున్సిపల్ డీఈ లక్ష్మణ్ ను ఆదేశించారు.
రెయిలింగ్, అర్చ్, లైటింగ్, ఫుట్
పాత్, కూర్చునే
కుర్చీ బల్లలు త్వరితగతిన పూర్తి చేసి పనులు వేగంగా జరగాల్సిన అవసరం ఎంతైనా
ఉన్నదని సూచనలు చేశారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సూచించారు. ప్రస్తుతం
నెక్లెస్ రోడ్ అభివృద్ధికై ఉన్న నిధులు, జరుగుతున్న నిర్మాణ పనులు సైక్లింగ్, వాకింగ్
ట్రాక్ నిర్మాణాలు, ఏర్పాట్లపై అధికారులు, కాంట్రాక్టరును ఆరా
తీశారు.
అనంతరం కోమటి చెరువు
కట్టపై కలియ తిరుగుతూ సుందరీకరణ పై ఆరా తీస్తూ కోమటి చెరువు కట్టపై ఎక్కడా కూడా
చెత్త చెదారం లేకుండా చూడాలని, చాలా చోట్ల గుబురుగా పెరిగిన గడ్డి తొలగించాలని
టూరిజం అధికారిక సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట మున్సిపల్
చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మున్సిపల్
ఈఈ వీర ప్రతాప్, ఏఈ మహేశ్, ఇతర అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.