రైతులను కాపాడుకోవాలనేదే ప్రభుత్వ ఉద్దేశ౦: కేసీఆర్
By: chandrasekar Wed, 07 Oct 2020 10:06 AM
వానాకాలం పంటల కొనుగోలు
అంశంపై మంగళవారం సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం
నిర్వహించారు. తెలంగాణలో వానాకాలం సాగైన వరి, పత్తి పంటలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు
చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొత్తం 6 వేల కొనుగోలు కేంద్రాల
ద్వారా ప్రతి గింజనూ కొనుగోలు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని
అధికారులను ఆదేశించారు. పంటలకు పెట్టుబడి అందించడం దగ్గరనుండి పంటల కొనుగోలు వరకు
ప్రతి విషయంలోనూ రైతులను కాపాడుకోవాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని సీఎం తెలిపారు.
తెలంగాణలో ఈ వానాకాలం రికార్డుస్థాయిలో మొత్తం 134.87 లక్షల ఎకరాల్లో పంటలు
సాగయ్యాయని, అందులో 52.77 లక్షల ఎకరాల్లో వరి, 60.36 లక్షల ఎకరాల్లో పత్తి, 10.78 లక్షల ఎకరాల్లో కంది సాగైందని పేర్కొన్నారు. ఐకేపీ సెంటర్లు, కో
ఆపరేటివ్ సొసైటీలు, మార్కెటింగ్ శాఖ ద్వారా రైతుల వరి ధాన్యాన్ని పూర్తిస్థాయిలో
కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. రైతులు తొందరపడి తక్కువ ధరకు
అమ్ముకోవద్దన్నారు. వరి ధాన్యం 17శాతం తేమకు లోబడి తీసుకొస్తే ఏ- గ్రేడ్ రకానికి
క్వింటాల్ కు రూ.1,888, బీ-గ్రేడ్ రకానికి క్వింటాల్కు రూ.1,868 కనీస
మద్దతు ధరను ప్రభుత్వమే చెల్లిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
వరి ధాన్యం కొనుగోలుపై
ఒకటి, రెండు
రోజుల్లో మార్గదర్శకాలు విడుదలవుతాయని, ఈ విషయంలో వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల
శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పత్తిని కూడా కాటన్
కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పూర్తిగా
కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. తాలు, పొల్లు
లేకుండా ఎండబోసిన వరిధాన్యాన్ని తెచ్చి కనీస మద్దతు ధర పొందాలని, తేమ
ఎక్కువ ఉన్న ధాన్యాన్ని తెచ్చి ఇబ్బంది పడవద్దని రైతులను సీఎం కోరారు. ఈ విషయంలో సీసీఐతో నిరంతరం సంప్రదింపులు
జరుపుతున్నామని చెప్పారు. రైతులకు ఈ విషయంలో ఏమైనా సందేహాలుంటే ఎప్పటికప్పుడు కాల్
సెంటర్ ద్వారా నివృత్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సమావేశంలో
మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ
పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే సీ లక్ష్మారెడ్డి, ప్రభుత్వ
ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, సివిల్
సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, టెస్కాబ్
చైర్మన్ కొండూరి రవీందర్రావు, పెద్దపల్లి జెడ్పీ చైర్ పర్సన్ పుట్ట మధు, సీఎం
సెక్రటరీ స్మితా సభర్వాల్, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డి, సివిల్
సప్లయీస్ కమిషనర్ అనిల్కుమార్, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, తదితరులు
పాల్గొన్నారు.