ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసారు ...కమల్ హాసన్
By: Sankar Mon, 06 July 2020 9:40 PM
సినీ నటుడు, మక్కల్ నీతి మయ్యం అధ్యక్షుడు కమల్ హసన్ పళని స్వామి సర్కార్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కరోనా విషయంలో పళని సర్కార్ జవాబుదారీ తనం లోపించిందని, సమన్వయం లేదని తీవ్రంగా మండిపడ్డారు. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం ఆటలాడుతోందని ఫైర్ అయ్యారు.
కరోనాను డీల్ చేసే వ్యవహారంలో ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిపోయింది. పౌరులందరూ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించాలి. పౌరుల భాగస్వామ్యంపై ప్రభుత్వం కూడా ఆసక్తి చూపిస్తే బాగుండేది’’ అని పేర్కొన్నారు. కోవిడ్ నిర్వహణలో కేరళ కంటే తమిళనాడు చాలా మంచి ఆరోగ్య మౌలిక సదుపాయాలను కలిగి ఉందని, కానీ వీటిని వినియోగించడంలో సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పళని సర్కార్ ఉదాసీనతకు ఇదో ఉదాహరణ అని మండిపడ్డారు.
కరోనా సమస్య తొందర్లోనే ముగుస్తుందని భావించి ఉంటారని, లేదా... మెడికల్ కౌన్సిల్ మాటనైనా పెడచెవిన పెట్టి ఉంటారని ఆయన విమర్శించారు. ప్రపంచంలో కనిపించేంత తీవ్రమైనది కాదని ఉన్నతాధికారులు విశ్వసించి ఉంటారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో ప్రజలతో ప్రభుత్వానికి ఏమాత్రం కమ్యూనికేషన్ లేదని, ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల భాగస్వామ్యాన్ని కోరలేదని కమల్ మండిపడ్డారు.