Advertisement

  • పదోతరగతి విద్యార్థులకు శుభవార్త.. స్కూల్‌కు వెళ్లకుండానే..!

పదోతరగతి విద్యార్థులకు శుభవార్త.. స్కూల్‌కు వెళ్లకుండానే..!

By: Anji Wed, 23 Sept 2020 11:14 AM

పదోతరగతి విద్యార్థులకు శుభవార్త.. స్కూల్‌కు వెళ్లకుండానే..!

కరోనా కారణంగా పిల్లల చదువులు అటకెక్కాయి. మార్చి నుంచి స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. తాజాగా పాఠశాలలు తెరిచినా.. పిల్లల్ని మాత్రం బడికి పంపేందుకు అనుమతులు రాలేదు. అటు తల్లిదండ్రులు కూడా ఆ ధైర్యం చేయలేకపోతున్నారు. అయితే ఇప్పటికే పిల్లలకు ఆన్ లైన్ పాఠాల్ని బోధిస్తున్నారు. అయితే పదోతరగతి పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానం తీసుకురావాలని ఆలోచనలు చేస్తోంది. పాఠశాలలో చేరకపోయినా ఫీజు చెల్లించి పదో తరగతి వార్షిక పరీక్షలు రాసే అవకాశం కల్పించనుంది.


ఇలాంటి వెసులుబాటును ఈ విద్యా సంవత్సరానికి(2020-21) ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తోంది. అన్ని వర్గాల అభిప్రాయాలు సేకరించిన అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాయాలంటే విధిగా ఏదో ఒక పాఠశాలలో చదివి ఉండాలనే నిబంధన ఉంది. ఆ పాఠశాల ద్వారానే విద్యార్థుల వివరాలు ప్రభుత్వ పరీక్షల విభాగానికి(ఎస్‌ఎస్‌సీ బోర్డు) సమర్పించాల్సి ఉంటుంది. కరోనా కారణంగా పాఠశాలలు మూతపడ్డాయి. ఇప్పటివరకు ప్రైవేటు పాఠశాలల్లో చదివి, ఆర్థికపరిస్థితులు తలకిందులైన కారణంగా ఫీజులు చెల్లించలేని పరిస్థితి చాలా కుటుంబాల్లో నెలకొంది.


ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్న కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఫీజులు చెల్లించాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి.ఈ క్రమంలో మొత్తం ఫీజు చెల్లిస్తేనే వార్షిక పరీక్షలకు అనుమతిస్తామని ఒత్తిడి తెచ్చే అవకాశాలుంటాయని విద్యాశాఖ భావిస్తోంది. దీంతో అలాంటి విద్యార్థుల కోసం ప్రభుత్వం నేరుగా పరీక్ష రాసే అవకాశం కల్పించాలని భావిస్తుంది. ఫీజులు కట్టలేని విద్యార్థులు చదువు మానేయకుండా, టీవీ పాఠాలతో చదువుకుంటూ పదోతరగతి పరీక్షలు రాసే అవకాశం ఇవ్వాలని అధికారులు యోచిస్తున్నారు.


దీనిపై నిర్ణయం తీసుకుంటే ఎవరైనా నేరుగా ఎస్‌ఎస్‌సీ బోర్డుకు పరీక్ష రుసుం చెల్లించడం ద్వారా హాల్‌టికెట్‌ పొంది, పరీక్షలు రాసే వీలుంటుంది. దీనిపై ఇటీవల పాఠశాల విద్యాశాఖ అధికారులు చర్చించినట్లు సమచారం. అయితే నేరుగా పరీక్ష రాసే సదుపాయం 2015 వరకు అమల్లో ఉండేది. నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) విధానం అమలులో భాగంగా అంతర్గత మార్కులు ప్రవేశపెట్టడంతో విద్యాశాఖ దాన్ని రద్దు చేసింది.

Tags :

Advertisement