ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలచేసి రికార్డు సృష్టించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
By: chandrasekar Sat, 13 June 2020 8:28 PM
ఆంధ్రప్రదేశ్ ఇంటర్
పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను రిలీజ్
చేశారు. కరోనా వైరస్ సంక్షోభ సమయంలో కూడా ఇలా ఇంటర్ పరీక్షలను రిలీజ్ చేసిన తొలి
రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించిందని మంత్రి సురేష్ అన్నారు. ఇదో చారిత్రాత్మక
రోజుగా అభివర్ణించారు. ఏపీలో మార్చి 4 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించగా, చివరి
పరీక్షకు ముందు దేశవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ విధించారు. దీంతో మిగిలి పోయిన ఒక్క
పరీక్షను జూన్ 3న నిర్వహించారు.
మార్చి 19 నుంచి
స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభించారు. మధ్యలో లాక్ డౌన్ కారణంగా కొంత ఆలస్యం అయింది.
రెండు నెలలు ఆలస్యంగా పరీక్షల ఫలితాలు వచ్చాయి. ఈరోజు ప్రకటించిన ఇంటర్మీడియట్
పరీక్షల ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 5,07,230 మంది పరీక్షలు హాజరయ్యారు. అందులో 300,560 మంది పాస్ అయ్యారు. అంటే 59 శాతం
ఉత్తీర్ణత సాధించినట్టు. ఇక ఇంటర్ సెకండియర్ పరీక్షలకు 4,35,653 మంది హాజరయ్యారు. అందులో 2,76,389 మంది పాస్ అయ్యారు. అంటే, 63 శాతం
ఉత్తీర్ణత సాధించారు. పరీక్షల్లో బాలికలు సత్తా చాటారు.
మొదటి సంవత్సరంలో 2,57,619 మంది బాలికలు పరీక్షలకు హాజరుకాగా, అందులో 1,64,365 ఉత్తీర్ణత సాధించారు. అంటే, 64 శాతం
పాస్ అయినట్టు. మొదటి సంవత్సరం బాలుర విషయానికి వస్తే 2,49,611 మంది పరీక్షకు హాజరయ్యారు. అందులో పాస్ అయిన వారి సంఖ్య 1,36,196. అంటే 55 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక రెండో సంవత్సరంలో కూడా
బాలికలే పై చేయి సాధించారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలకు 2,22,798 హాజరు కాగా, 1,49,010 పాస్ అయ్యారు. 67 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. అదే బాలుర
విషయానికి వస్తే సెకండియర్లో 2,12,857 మంది పరీక్షలకు హాజరుకాగా, అందులో
1,27,379 మంది పాస్ అయ్యారు. 60 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు.
జిల్లాల వారీగా చూస్తే
ఫస్ట్ ఇయర్, సెకండియర్ రెండింట్లోనూ 75 శాతం
పాస్ పర్సంటేజీతో కృష్ణా జిల్లా టాప్ ప్లేస్లో నిలిచింది. ఫస్ట్ ఇయర్లో రెండో
ప్లేస్ రెండు జిల్లాలు సాధించాయి. 65 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమ గోదావరి, గుంటూరు
రెండో స్థానంలో నిలిచాయి. సెకండియర్కు సంబంధించి 71 శాతం పాస్ పర్సంటేజీతో
పశ్చిమ గోదావరి రెండో స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్లో 63 శాతం
ఉత్తీర్ణత సాధించడం ద్వారా విశాఖ జిల్లా మూడో స్ధానంలో నిలిచింది. సెకండియర్లో 68 శాతం
పాస్ పర్సంటేజీతో నెల్లూరు, విశాఖ జిల్లాలు సంయుక్తంగా మూడోస్థానంలో నిలిచాయి. ఇక
ప్రభుత్వ జూనియర్ కాలేజీల విషయానికి వస్తే ఫస్ట్, సెకండియర్ ఫలితాలు
రెండింట్లోనూ విజయనగరం జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. పశ్చిమగోదావరి, శ్రీకాకుళం
జిల్లాలో రెండో స్థానంలో నిలిచాయి. ఫస్ట్ ఇయర్లో మూడో స్థానం కృష్ణా జిల్లా, సెకండియర్లో
మూడో స్థానం చిత్తూరు జిల్లా సొంతం చేసుకున్నాయి.