కరోనా ప్రభావంతో ఉద్యోగం కోల్పోయి వారికీ గుడ్ న్యూస్...!
By: Anji Fri, 02 Oct 2020 09:27 AM
కరోనా మహమ్మారి ప్రభావంతో ఉద్యోగం కోల్పోయి నెల రోజుల్లో మళ్లీ రాకుంటే ఆ వ్యక్తికి నిరుద్యోగ సాయం కింద గత రెండేళ్ల వేతనం ఆధారంగా రోజువారీ జీతంలో 50 శాతం చొప్పున గరిష్ఠంగా 90 రోజులకు ఈ పరిహారం చెల్లిస్తారు.
ఉద్యోగం కోల్పోయే సమయానికి బీమా సంస్థలో రెండేళ్లపాటు సభ్యత్వం ఉన్నవారు పరిహారం పొందేందుకు అర్హులు. ఈ ఏడాది మార్చి 24 నుంచి డిసెంబరు 31 వరకు ఉపాధి కోల్పోయి దరఖాస్తు చేసిన కార్మికుల వ్యక్తిగత ఖాతాల్లో ఈఎస్ఐసీ నగదును జమ చేస్తుంది. ఇందుకోసం అర్హులు నేరుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈఎస్ఐ పరిధిలోకి వచ్చే వేతన జీవులు ఉద్యోగం కోల్పోతే జీవితంలో ఒకసారి ఈఎస్ఐసీ సంస్థ అటల్ బీమిత్ వ్యక్తి కల్యాణ్ యోజన (ఏబీవీకేవై) కింద నిరుద్యోగ భృతి ఇస్తోంది.
ఇప్పటి వరకు గరిష్ఠంగా 90 రోజుల వేతనంలో 25 శాతం మాత్రమే చెల్లించేవారు. కరోనాతో కొత్త ఉద్యోగాల వేట కష్టమవుతుండటంతో పరిహారాన్ని 50 శాతానికి పెంపు.90 రోజులపాటు మరో ఉద్యోగం లభించకుంటే గతంలో ఈ పరిహారం ఇచ్చేవారు. తాజాగా ఈ కాలపరిమితిని 30 రోజులకు తగ్గించారు. * క్లెయిమ్లను దాఖలు చేసే సమయానికి ఉద్యోగులు, కార్మికులు నిరుద్యోగిగా ఉండాలి.
కార్మికులు ఐపీ నంబరు ఆధారంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సంబంధిత యాజమాన్యం నుంచి వివరాలు తనిఖీ చేసి 15 రోజుల్లో పరిహారం చెల్లిస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేశాక.. రూ.20 నాన్జ్యుడిషియల్ పేపరుపై వివరాలను నమోదు చేసి, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్పుస్తకం జిరాక్స్ లను దగ్గర్లోని ఈఎస్ఐసీ కార్యాలయంలో లేదా స్పీడ్పోస్టు ద్వారా పంపించాల్సి ఉంటుంది.
ఏదేని శిక్షలో భాగంగా ఉద్యోగం కోల్పోయిన వ్యక్తులు ఈ పథకం కింద అనర్హులు అవుతారు. స్వచ్ఛంద పదవీ విరమణ, పదవీ విరమణ, లాక్ అవుట్, కార్మికశాఖ గుర్తించని సమ్మెలోని వేతన జీవులు దరఖాస్తు చేయకూడదు.రెండేళ్లకు 730 పనిదినాల చొప్పున సగటు రోజువారీ వేతనం లెక్కకడుతారు.
ఉదాహరణకు ఒక కార్మికుడికి గడిచిన రెండేళ్లలో ఈఎస్ఐ చందా ప్రకారం వేతనం రూ.2.4 లక్షలు ఉంటే.. ఆ మొత్తాన్ని 730 రోజులతో భాగించి ఒకరోజు వేతనం రూ.328.76గా లెక్కిస్తారు. గరిష్ఠంగా 90 రోజులకయ్యే మొత్తంలో 50 శాతం పరిహారం ఇస్తారు.