తల్లి , అన్నను కాల్చి చంపిన మైనర్ బాలిక
By: Sankar Sat, 29 Aug 2020 9:55 PM
మానసిక పరిస్థితి సరిగా లేని ఓ బాలిక తల్లిని, సోదరుడ్ని కాల్చి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్లో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, లక్నో గౌతమ్పల్లి కాలనీకి చెందిన ఓ బాలిక పదవ తరగతి చదువుతోంది.
జాతీయ స్థాయి షూటింగ్లో పాల్గొన్న సదరు బాలిక మానసిక పరిస్థితి గత కొద్దికాలంగా బాగుండటం లేదు. ఈ నేపథ్యంలో శనివారం షూటింగ్ ప్రాక్టీస్ చేసే తుపాకితో తల్లి, సోదరుడిపై కాల్పులు జరిపింది. అనంతరం బ్లేడుతో కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది.నిందితురాలిని చైల్డ్ ప్రొటెక్షన్ హోమ్కు తరలించి కేసు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు.
కాగా, శనివారం మధ్యాహ్నం లక్నోలో రైల్వే అధికారి ఆర్డీ బాజ్పాయ్ భార్య మాలతి (45), కొడుకు సర్వదత్ (20) ఆయన ఇంట్లోనే విగతజీవులుగా పడిఉన్నారు. సర్వదత్ తలపైన, మాలతి ఛాతిపైన బుల్లెట్ గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే, ఆ ఇంట్లోనే రైల్వే అధికారి కూతురు అయిన మైనర్ బాలిక షాక్ లో ఉండటంతో.. హత్యలు చూసి ఆమె షాక్లోకి వెళ్లిందని భావించారు. అయితే బాలిక ఒంటిపై బ్లేడు గాయాలు గమనించిన పోలీసులు అనుమానంతో ప్రశ్నించగా.. తానే హత్యలు చేసినట్లు ఒప్పుకున్నది. ఆ జంట హత్యలకుగల కారణాలు తెలియాల్సి ఉంది.