ఆరోవిడత హరితహారాన్ని విజయవంతం చేయుటకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధం
By: chandrasekar Fri, 26 June 2020 6:59 PM
పచ్చటి పర్యావరణం
ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటుకు సమయం ఆసన్నమైంది. ఆకుపచ్చ తెలంగాణకోసం ఆరోవిడత
హరితహారానికి ప్రభుత్వం సిద్ధమైంది.
మొక్కలను నాటి సంరక్షించే బాధ్యత మనదే.
ఆరోవిడత హరితహారాన్ని
విజయవంతం చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సర్వం సిద్ధం చేశారు. నేడు హరితహారం
లాంఛనంగా ప్రారంభం కానుండడంతో ఆయా సర్కిళ్ల వారీగా ప్రత్యేక ప్రణాళికలు
రూపొందించారు.
కాలనీలు, బస్తీల
వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు, సామాన్య ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులను భాగస్తులను
చేస్తూ హరితహారం విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కాలనీల్లో మొక్కలు
నాటేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించిన అధికారులు విడతల వారీగా అన్ని ప్రాంతాల్లో
మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యారు. కూకట్పల్లి జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో 38 లక్షల
మొక్కలను నాటాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారు. మూసాపేట సర్కిల్లో 6.42
లక్షలు, కూకట్పల్లి
సర్కిల్లో 5.52 లక్షలు, కుత్బుల్లాపూర్ సర్కిల్లో 7.16
లక్షలు, గాజులరామారం
సర్కిల్లో 15.63 లక్షలు, అల్వాల్ సర్కిల్లో 3.26 లక్షల మొక్కలు నాటేందుకు
ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఆయా సర్కిళ్ల పరిధిలోని
శ్మశానవాటికలు, పార్కులు, రోటరీలు, ప్రభుత్వ పాఠశాల, కళాశాలలు, ప్రభుత్వ
ఖాళీ స్థలాలు, చెరువు గట్లు, బఫర్ జోన్లలో, కుంటల పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటనున్నారు.
గాలివానకు కొమ్మలు విరగడం, కూలిపోవడం, ఎండిపోవడం లాంటి సమస్యలను తట్టుకునేలా ఈ యేడాది
స్థానిక మొక్కలకే ప్రాధాన్యతనివ్వనున్నారు.
గతంలో హరితహారంలో నాటిన
మొక్కలలో పచ్చదనానికే ప్రాధాన్యతనిచ్చామని ఈ యేడాది పచ్చదనంతో పాటు పరిస్థితులను
తట్టుకుని నిలబడే స్థానిక మొక్కలకే ప్రాధాన్యతనివ్వనున్నట్లు అధికారులు
చెబుతున్నారు. అలాగే చిన్న మొక్కలను నాటడం వల్ల వాటి సంరక్షణ కష్టతరంగా మారుతుందని
ఈ యేడాది ఎదిగిన పెద్ద మొక్కలనే నాటనున్నట్లు ఉద్యానవనశాఖ అధికారులు అంటున్నారు.
హరితహారం విజయవంతం
చేసేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం. సర్కిళ్లు, డివిజన్ల వారీగా
అధికారులకు బాధ్యతలను అప్పగించాం. నాటిన మొక్క కచ్చితంగా పెరిగి పెద్దగా మారేలా
జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
నేడు జోన్ పరిధిలోని
కేపీహెచ్బీ కాలనీ సీబీసీఐడీ కాలనీ, కూకట్పల్లి, గండిమైసమ్మ, అల్వాల్లలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలచే
మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభమవుతుంది. త్వరలోనే ఇంట్లో పెంచుకునే మొక్కలను
పంపిణీ చేస్తాం అని అధికారులు తెలిపారు.