జీహెచ్ఎంసీ ఏగ్జిట్ పోల్స్ నిషేధం.. ఎస్ఈసీ సంచలన నిర్ణయం
By: chandrasekar Tue, 01 Dec 2020 7:25 PM
జీహెచ్ఎంసీ ఎన్నికలు
మంగళవారం ఉదయం 7.00 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6.00 గంటల
వరకు కొనసాగనుంది. చిన్న చిన్న ఘటనలు మినహా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్
కార్పొరేషన్ ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఇదిలా ఉండగా.. ఎగ్జిట్ పోల్స్పై రాష్ట్ర
ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. కొన్ని చోట్ల రీ-పోలింగ్ నిర్వహించాల్సి
ఉన్నందున ఎగ్జిట్ పోల్స్పై నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది. డిసెంబరు 3
సాయంత్రం వరకు ఇది అమల్లో ఉంటుందని పేర్కొంది. ఓల్డ్ మలక్పేట డివిజన్లో
అభ్యర్థుల గుర్తులు తారుమారయ్యాయి. బ్యాలెట్ పత్రంలో సీపీఐ పార్టీ అభ్యర్థి పేరు
ఎదురుగా సీపీఎం పార్టీ గుర్తు ముద్రించారు. దీంతో పోలింగ్ నిలిపివేయాలంటూ సీపీఐ
నేతలు డిమాండ్ చేశారు.
దీనిపై స్పందించిన
ఎన్నికల సంఘం ఓల్డ్ మలక్పేటలోని పలు కేంద్రాల్లో పోలింగ్ నిలిపివేస్తూ నిర్ణయం
తీసుకుంది. ఓల్డ్ మలక్పేట డివిజన్ పరిధిలోని 69 పోలింగ్ కేంద్రాల్లో
ఎల్లుండి రీపోలింగ్ నిర్వహించాలని ఎస్ఈసీ నిర్ణయించింది. ఎల్లుండి రీ పోలింగ్
ఉండటంతో ఎగ్జిట్ పోల్స్ను ఎస్ఈసీ నిషేధించింది. మరోవైపు, పలు
చోట్ల ఉద్రిక్తతల మధ్య పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ
టీఆర్ఎస్, బీజేపీ
కార్యకర్తలు పరస్పరం ఆరోపణలకు దిగడంతో ఘర్షణ చోటు చేసుకుంది. కేపీహెచ్బీ
కాలనీలోని పోలింగ్ కేంద్రం 58 వద్ద, బంజారాహిల్స్ ఎన్జీనగర్ పోలింగ్ కేంద్రాల వద్ద
ఉద్రిక్తత నెలకొంది. ఇదిలా ఉండగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కు
వినియోగించుకునేందుకు యాజమాన్యాలు అనుమతి ఇవ్వట్లేదని రాష్ట్ర ఎన్నికల సంఘానికి
ఫిర్యాదులు అందుతున్నాయి. కాప్రా, కుషాయిగూడ, చర్లపల్లి ప్రాంతాల్లోని పారిశ్రామకవాడల్లో
పనిచేస్తు్న్న పలువురు కార్మికులు ఎస్ఈసీ కాల్ సెంటర్కు ఫోన్ చేసి తాము ఓటు
హక్కు వినియోగించుకునేందుకు యాజమాన్యాలు అనుమతించడం లేదని ఫిర్యాదు చేశారు.
సంబంధిత కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్ల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు.