ఈ సారి కూడా 50 కంటే తక్కువే ...గ్రేటర్ లో పోలింగ్ వివరాలను వెల్లడించిన ఈసీ
By: Sankar Wed, 02 Dec 2020 04:34 AM
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో 45.71 శాతం పోలింగ్ నమోదైనట్లు మంగళవారం రాత్రి ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అయితే పూర్తి స్థాయి పోలింగ్ వివరాలను బుధవారం ప్రకటించనున్నట్లు వెల్లడించింది.
కాగా, కొన్ని డివిజన్లలో కనీసం 25 శాతం కూడా పోలింగ్ నమోదు కాలేదని తెలుస్తోంది. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.29 శాతం పోలింగ్ నమోదైంది. జీహెచ్ఎంసీలోని 149 డివిజన్ల పరిధిలో మంగళవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ ఆద్యం తం మందకొడిగా సాగింది.
కరోనా భయానికి తోడు పార్టీలు, నేతల తీరుపై సరైన అభిప్రాయం లేక చాలామంది ఓటేసేందుకు అయిష్టత వ్యక్తం చేశారు. ఆయా డివిజన్లలో పోటీచేస్తున్న 1,122 మంది అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ పెట్టెల్లో నిక్షిప్తమైంది. పోలీసు భద్రత నడుమ బ్యాలెట్ పెట్టెలను స్ట్రాంగ్ రూంలకు తరలించారు. ఈ నెల 4న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలు ప్రకటిస్తారు.