జిహెచ్ఎంసి ఎన్నికలు తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన వామపక్షాలు
By: Sankar Wed, 18 Nov 2020 5:23 PM
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో హడావిడి మొదలైంది. ఈ సందడిలో ప్రధాన ఘట్టమైన అభ్యర్థుల ఎంపికలో వామపక్షాలు ఒక అడుగే ముందే ఉన్నాయి. జీహెచ్ఎంసీలో ఉమ్మడిగా బరిలో దిగనున్న సీపీఎం, సీపీఐ తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం విశేషం...
ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డీజీ నర్సింహారావు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలలో ప్రజల సమస్యలేవీ తీరలేదంటూ టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. దుబ్బాక హడావిడి అయిపోక ముందే దొంగచాటుగా ఎన్నికలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ కూడా ప్రభుత్వం ఏమి చెయ్యమంటే అదే చేస్తుందని వ్యాఖ్యానించారు. రెండు నెలల ముందే ఎన్నికలను ప్రకటించారన్నారు.
అలాగే వరద బాధితుల సహాయం నిజమైన వ్యక్తులకు చేరడంలేదన్నారు. మొన్నటి వరకు వరద బాధితులకు 10వేల రూపాయలు ఇస్తే ప్రస్తుతం అందరికి ఇస్తున్నారని,ఎన్నికలకు ముందు ప్రజలను తమవైపునకు తిప్పుకునేందుకే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. వీటన్నింటినీ గమనించి ప్రజలందరూ తమ పార్టీ ఓటు వెయ్యాలని ఆయన విజ్ఞప్తి చేశారు.