30 చోట్ల జీహెచ్ఎంసీ డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాలు....
By: chandrasekar Fri, 27 Nov 2020 11:22 AM
జీహెచ్ఎంసీ ఎన్నికల
నేపథ్యంలో పోలింగ్, దాని అనంతరం ప్రక్రియకు చేపట్టవలసిన చర్యలను ఎన్నికల
సంఘం పూర్తిచేసింది. ఎన్నికలకు ముందు రోజు పోలింగ్ కేంద్రాలకు సామగ్రి పంపిణీ, ఓటింగ్
ముగిశాక బ్యాలెట్ బాక్సులను భద్రపరచడం, ఓట్ల లెక్కింపునకు సర్కిళ్ల వారీగా 30 డీఆర్సీ
కేంద్రాలను ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీలోని 6 జోన్లు, 27
సర్కిళ్ల పరిధిలోని విద్యాసంస్థలు, ఇండోర్ స్టేడియాలను ఇందుకోసం ఎంపికచేసింది. ఒక్కో
కేంద్రంలో గరిష్ఠంగా 7, కనిష్ఠంగా 3 వార్డులకు సంబంధించిన ఓట్లను లెక్కించనున్నారు. ఈ
వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది.
ప్రత్యేక కౌంటింగ్ హాల్
ఓట్ల లెక్కింపును వేగంగా, సులభంగా
చేపట్టేలా డివిజన్కు ఒకటి చొప్పున 150 కౌంటింగ్ హాల్స్, ఓటింగ్ సామగ్రి, బ్యాలెట్
బాక్సులను భద్రపరిచేందుకు 150 స్ట్రాంగ్రూమ్లను సిద్ధంచేశారు. ప్రతిహాల్లో 14
టేబుళ్లను ఏర్పాటుచేసి ఓట్లను లెక్కించనున్నారు. ఒక్కో టేబుల్పై ఒక సూపర్వైజర్, ఇద్దరు సహాయకులు ఉంటారు.
ఒక్కోరౌండ్లో వెయ్యి చొప్పున 14 టేబుళ్లపై 14వేల ఓట్లు లెక్కించనున్నారు. మల్కాజ్గిరి సర్కిల్లో
ఏర్పాటుచేసిన కేంద్రంలో హాల్లు చిన్నగా ఉండటంతో ఒక్కో హాల్లో ఏడు టేబుళ్లను
ఏర్పాటుచేస్తున్నామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. పోలింగ్కు అవసరమైన
సామగ్రి పంపిణీ, ఓటింగ్ ముగిశాక బ్యాలెట్ బాక్సులను తీసుకువచ్చి
అప్పగింత, ఓట్ల
లెక్కింపు అంతా ఈ 30 కేంద్రాల్లోనే జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల అధికారి
పార్థసారథి పేర్కొన్నారు. ప్రక్రియను సులభంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు
చేశామని, లెక్కింపు
ముగిసే వరకు ఈ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని తెలిపారు.