Advertisement

  • శ్రీశైలం పవర్ ప్లాంట్ అగ్ని ప్రమాద బాధితులకు భారీ పరిహారం ప్రకటించిన తెలంగాణ జెన్ కో

శ్రీశైలం పవర్ ప్లాంట్ అగ్ని ప్రమాద బాధితులకు భారీ పరిహారం ప్రకటించిన తెలంగాణ జెన్ కో

By: Sankar Sun, 06 Sept 2020 06:17 AM

శ్రీశైలం పవర్ ప్లాంట్ అగ్ని ప్రమాద బాధితులకు భారీ పరిహారం ప్రకటించిన  తెలంగాణ జెన్ కో


శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఎక్స్ గ్రేషియాకు అదనంగా రూ.75 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించినట్లు తెలంగాణ జెన్ కో- ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు ప్రకటించారు. ఈ ప్రమాదంలో మరణించిన డిఇ కుటుంబానికి మొత్తం రూ.1.25 కోట్లు, మిగతా ఉద్యోగుల కుటుంబాలకు 1 కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందుతుందని వెల్లడించారు.

మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఇతర శాఖాపరమైన సహాయం కూడా త్వరితగతిన అందించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ జెన్ కో బోర్డు సమావేశం సిఎండి ప్రభాకర్ రావు అధ్యక్షతన విద్యుత్ సౌధలో శనివారం జరిగింది. శ్రీశైలం ప్రమాదంపై బోర్డు సమావేశంలో విస్తృతంగా చర్చించారు. మరణించిన వారికి బోర్డు సభ్యులు సంతాపం తెలిపారు.

అంతకుముందు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శ్రీశైలం ప్రమాదంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునే విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, కుటుంబ పెద్దను కోల్పోయి దుఃఖంలో ఉన్న వారి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సముచిత నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. గతంలో ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి సహాయం అందింది, భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే విషయంతో సంబంధం లేకుండా శ్రీశైలం ప్రమాదాన్ని ప్రత్యేక పరిస్థితిగా పరిగణలోకి తీసుకుని, ప్రత్యేక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు.

విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కూడా మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు చేయగలిగినంత సాయం చేయాల్సిందిగా సిఎండిని కోరారు.ముఖ్యమంత్రి, మంత్రి ఆదేశాలను పరిగణలోకి తీసుకుని, మరణించిన వారి త్యాగాన్ని, సాహసాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాల్సిన సహాయంపై బోర్డు విస్తృతంగా చర్చించింది. శ్రీశైలం ప్రమాదాన్ని ప్రత్యేకమైన అంశం గా పరిగణించి సహాయం అందించాలని బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయించింది.

Tags :
|

Advertisement