గంగూలీకి వార్నింగ్ ఇచ్చిన సచిన్ ..
By: Sankar Tue, 09 June 2020 10:03 AM
భారత దిగ్గజ ద్వయం సచిన్ టెండూల్కర్ - సౌరవ్ గంగూలీ అప్పట్లో క్రీజులో నిలిచారంటే. ప్రత్యర్థి టీమ్ బౌలర్లు బౌలింగ్ చేయలేక తల పట్టుకునేవారు. సుదీర్ఘకాలం టీమిండియాకి వెన్నెముకలా నిలిచిన ఈ జోడీ.. 176 ఇన్నింగ్స్ల్లో 47.55 సగటుతో ఏకంగా 8,227 పరుగులు చేసింది. ఇందులో 26 శతక భాగస్వామ్యాలు ఉన్నాయి. కానీ.. కెరీర్ ఆరంభంలోనే గంగూలీకి సచిన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడట. ఇంటికి వెళ్లిపో.. నీ కెరీర్ ముగిసిపోయిందని అప్పట్లో హెచ్చరించినట్లు సీనియర్ జర్నలిస్ట్ విక్రాంత్ గుప్త తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలోని భారత్ జట్టు 1997లో వెస్టిండీస్ పర్యటనకి వెళ్లింది. ఆ సిరీస్లో భాగంగా బార్బడోస్లో జరిగిన మూడో టెస్టుల్లో సచిన్ (92), రాహుల్ ద్రవిడ్ (78) మినహా అందరూ ఫెయిలయ్యారు. సౌరవ్ గంగూలీ ఫస్ట్ ఇన్నింగ్స్లో 22, సెకండ్ ఇన్నింగ్స్లో 8 పరుగులు చేయగా.. భారత్ జట్టు 38 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. దాంతో.. కెప్టెన్ సచిన్ తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తూ.. డ్రెస్సింగ్ రూములో ఆటగాళ్లకి క్లాస్ తీసుకున్నట్లు విక్రాంత్ చెప్పుకొచ్చాడు. కానీ.. ఆ క్లాస్ అనంతరం సచిన్ని ఓదార్చేందుకు గంగూలీ వెళ్లి.. వార్నింగ్ని ఎదుర్కొన్నాడని అతను వివరించాడు.
డ్రెసింగ్ రూములో ఆటగాళ్లందరికీ సచిన్ క్లాస్ తీసుకున్నాడు. ఆ సమయంలో కెప్టెన్సీ సామర్థ్యంపై సందేహాలని కూడా అతను వ్యక్తపరిచాడు. దాంతో.. అప్పుడప్పుడే టీమ్లోకి వచ్చిన సౌరవ్ గంగూలీ.. కెప్టెన్ సచిన్ని ఓదార్చేందుకు అతని వద్దకు వెళ్లాడు. అయితే.. గంగూలీతో పెద్దగా మాట్లాడని సచిన్.. రేపు పొద్దునే మార్నింగ్ రన్కి రెడీగా ఉండాలని ఆదేశించాడు. కానీ.. గంగూలీ మరుసటి రోజు ఆ రన్కి వెళ్లలేదు. దాంతో.. కోప్పడిన సచిన్ ‘సర్దుకుని ఇంటికి వెళ్లిపో ఇక్కడితో నీ కెరీర్ ముగిసింది’ అని గంగూలీకి వార్నింగ్ ఇచ్చాడు’’ అని విక్రాంత్ వెల్లడించాడు.