Advertisement

ఐసీసీ చీఫ్ గా గంగూలీ రావాలి: అరుణ్ ధుమాల్

By: chandrasekar Thu, 09 July 2020 3:52 PM

ఐసీసీ చీఫ్ గా గంగూలీ రావాలి: అరుణ్ ధుమాల్


సౌరవ్ గంగూలీ టీమిండియా మాజీ కెప్టెన్ గా సేవలందించి ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ రోజు ఆయన 48 వ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ ద్వారా పలువురు క్రికెటర్లు, మాజీలు, ఇతర ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

కాగా, బీసీసీఐ ప్రస్తుత కోశాధికారిగా ఉన్న అరుణ్ ధుమాల్ మాత్రం తన ప్రత్యేకతను చాటుకొన్నారు. ప్రస్తుత తరుణంలో ఐసీసీ బలపడాలంటే గంగూలీ దాదా లాంటి వ్యక్తులను ఐసీసీ చీఫ్ గా తీసుకురావాలని ఆకాంక్షించారు. బీసీసీఐలో యువ రక్తాన్ని తీసుకొచ్చిన గంగూలీ ఐసీసీలో కూడా కొత్త ముఖాలను తీసుకొచ్చి అంతర్జాతీయంగా క్రికెట్ అభ్యున్నతికి పాటుపడగలరని అరుణ్ ధుమాల్ అభిప్రాయపడ్డారు.

గత అక్టోబర్ నెలలోనే బీసీసీఐ కోశాధికారిగా బాధ్యతలు తీసుకొన్న నాకు దాదాతో కేవలం 9 నెలల అనుబంధమే ఉన్నదన్నారు. అయినప్పటికీ ఆయనను ఎంతో చదివానన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఐసీసీ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నదని, ఈ సమయంలోనే దానిని పైకి తీసుకురావడానికి దాదాలాంటి వ్యక్తులు అవసరమన్నారు.

గంగూలీనీ ఐసీసీ అధ్యక్షుడిగా నిలిపేందుకు బీసీసీఐ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఏది ఏమైనా దాదానే అధ్యక్ష పదవికి అర్హుడు అని చెప్పారు. ఇలాఉండగా, సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీకాలం ఈ నెలతోనే ముగియనున్నది.

Tags :
|
|
|

Advertisement