Advertisement

అమెరికా లో గాంధీ విగ్రహం ధ్వంసం

By: Sankar Thu, 04 June 2020 5:15 PM

అమెరికా లో గాంధీ విగ్రహం ధ్వంసం

గత కొన్ని రోజులుగా అమెరికా అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. నల్లజాతీయుడి హత్యతో అగ్రరాజ్యంలో ఆందోళనలు మిన్నంటాయి. మిన్నియాపోలీస్‌లో జార్జ్ ఫ్లాయిడ్ అనే ఓ నల్లజాతీయుడిని పోలీసులు హతమార్చడంతో.. అమెరికా అంతటా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా నిరసనకారులు ఆ దేశంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. వాషింగ్టన్ డీసీలోని ఇండియన్ ఎంబసీలో ఉన్న గాంధీ విగ్రహాన్ని నల్లజాతీయులు ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ నిరసనకారులు ఈ విధ్వంసానికి పాల్పడినట్లు ఓ వార్త సంస్థ పేర్కొన్నది.

గాంధీ విగ్రహం ధ్వంసం ఘటనపై వాషింగ్టన్ పార్క్ పోలీసులు విచారణ మొదలుపెట్టారు. వాషింగ్టన్‌లోని భారతీయ దౌత్యకార్యాలయంలో.. గాంధీ విగ్రహం ధ్వంసం కావడం కూడా ఆందోళనకారులు పనే అని తేలింది. అయితే ఆందోళనకారులు హింసాత్మక బాట పట్టడంతో.. వారిని ట్రంప్ హెచ్చరించారు. ప్రదర్శనలను శాంతియుతంగా చేయకుంటే.. ఆర్మీని రంగంలోకి దింపాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. అయితే అక్కడ ఆందోళనలు మాత్రం ఆగలేదు. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నల్లజాతీయుడిని చంపిన పోలీసు ఆఫీసర్ డెరిక్ చౌవిన్‌తో పాటు ఇతరు పోలీసులపైనా కేసులు నమోదు అయ్యాయి.

ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలతో జాతి వివక్షలు పెచ్చరిల్లుతున్నాయని, ఇందులో ఆగ్రదేశాల కుట్రలు ఉన్నాయని మేధావులు విశ్లేషిస్తున్నారు..తక్షణమే అమెరికా ప్రభుత్వం ఈ సంఘటనపై పూర్తి విచారణ జరిపించాలని,భారత ప్రభుత్వం ట్రంప్‌పై ఒత్తిడి తీసుకురావాలని, ఇది ఒక విగ్రహాంపై జరిగిన దాడి కాదని భారత ఆత్మగౌరవంపై జరిగిన దాడి అని, విచారణ వేగవంతం చేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు..


Tags :
|
|

Advertisement