రూ.3వేల కోసం స్నేహితుడి హత్య
By: Dimple Fri, 04 Sept 2020 08:57 AM
కేవలం రూ.3వేల కోసం స్నేహితుడినే దారుణంగా హత్య చేసిన ఉదంతమిది. చేవెళ్ల పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రవీందర్రెడ్డి, ఇన్స్పెక్టర్ బాలకృష్ణ వివరాలు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారం గ్రామానికి చెందిన బోయిని సత్తయ్య (40)కు, భార్యకు మధ్య గొడవల కారణంగా కొన్ని నెలలుగా అతను ఒంటరిగానే కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు.
చేవెళ్ల మండలంలోని మల్కాపూర్ గ్రామంలో వ్యవసాయ క్షేత్రంలో అతని సోదరుడు ఆంజనేయులు పని చేస్తుండగా అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఒగ్గు శివరాజు అలియాస్ బీర్ల శివ (23)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ మద్యం తాగడం అలవాటు చేసుకున్నారు.
ఈ క్రమంలో ఆగస్టు 29న సాయంత్రం ఇద్దరూ గ్రామంలోని కల్లు దుకాణం వద్దకు వెళ్లారు. అక్కడ సత్తయ్య జేబులో డబ్బు కనిపించడంతో వాటిని కాజేయాలని పథకం రచించిన శివ.. మద్యం తాగుదామని గ్రామ శివారులోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. తన వెంట తెచ్చిన మద్యం తాగించి సత్తయ్య మత్తులోకి జారుకోగానే పక్కనే ఉన్న బండరాయిని తలపై వేసి అతని జేబులో ఉన్న రూ.3వేలు తీసుకొని ఇంటికి వెళ్లిపోయాడు.
మరుసటిరోజు శవం కనిపించడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించగా ఇద్దరూ కలిసి వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు శివను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడని ఏసీపీ తెలిపారు. అతన్ని చేవెళ్ల కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించినట్లు వివరించారు.