Advertisement

ఇళ్లకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని కీలక నిర్ణయం...!

By: Anji Fri, 27 Nov 2020 7:57 PM

ఇళ్లకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని కీలక నిర్ణయం...!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో శుక్రవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పేదల ఇళ్ల కోసం ఉచితంగా ఇసుక ఇవ్వాలని కేబినెట్ మీటింగ్‌లో నిర్ణయించారు.

కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మీడియాకు వెల్లడించారు. డిసెంబర్‌ 25న పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తామని.. దీనికి కేబినెట్‌ ఆమోదముద్ర వేసిందని కన్నబాబు తెలిపారు.

డిసెంబర్ 25న 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు 28.30 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. తొలి దశలో 16 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. కోర్టు కేసుల్లో ఉన్న ఇళ్ల స్థలాలను తర్వాతి దశలో ప్రారంభించేందుకు కేబినెట్‌ నిర్ణయించిందని వెల్లడించారు.

ఆయా ఇళ్లకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో 2022 జూన్‌ నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని మంత్రి కన్నబాబు ప్రకటించారు.

ఆయా కాలనీలకు మంచి నీరు, విద్యుత్‌ సౌకర్యం తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారని చెప్పారు. అలాగే డిసెంబర్‌ 15న వైఎస్సార్‌ పంటల బీమా చెల్లింపులు చేసేందుకు కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని మంత్రి కన్నబాబు వెల్లడించారు.

ఆ రోజు నేరుగా రైతుల ఖాతాల్లోనే పంటల బీమా సొమ్ము జమ చేస్తామన్నారు. అలాగే అంగన్వాడీ, హోంగార్డుల వేతన బకాయిలు చెల్లించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు.

ఏపీ గేమింగ్‌ యాక్ట్‌-1974కు సవరణ

డిసెంబర్‌ 2న ఏపీ అమూల్‌ ప్రాజెక్టు, డిసెంబర్‌ 10న మేకలు, గొర్రెల పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించేందుకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసిందని మంత్రి కన్నబాబు వెల్లడించారు.

రైతుల భూములు వివాద రహితంగా ఉండేందుకు సాంకేతిక సహకారంతో భూముల రీసర్వే చేపడతామని.. ఈ కార్యక్రమాన్ని డిసెంబర్‌ 21న సీఎం ప్రారంభిస్తారని కన్నబాబు వివరించారు. ఆక్వా రంగం అభివృద్ధికి ఫిషరీస్‌ చట్టం తీసుకొచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు.

ఆన్‌లైన్‌ గాంబ్లింగ్‌పై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని.. ఇందుకు ఏపీ గేమింగ్‌ యాక్ట్‌-1974 చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్‌ తీసుకొస్తామని మంత్రి కన్నబాబు ప్రకటించారు.

ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల కోసం కార్పొరేషన్‌, పల్నాడు ప్రాంతంలో కరువు నివారణకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయించిందని కన్నబాబు వివరించారు.

Tags :

Advertisement