ఓఎల్ఎక్స్లో స్మార్ట్ఫోన్ విక్రయం పేరుతో మోసం
By: chandrasekar Tue, 25 Aug 2020 09:00 AM
అనతి కాలంలో డిజిటల్ మోసాలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఆఫర్ల రూపంలో మాయ మాటలు చెప్పి అకౌంట్ నుండి డబ్బులు దోచుకోవడం వంటి అనేక సంఘటనలు రోజూ వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆన్లైన్ సెకండ్ హ్యాండ్ పరికరాల విక్రయ సంస్థ ఓఎల్ఎక్స్లో ఓ యువకుడు సెలఫోన్ కొనబోయి మోసపోయాడు.
తక్కువ రేటుకు స్మార్ట్ ఫోన్ ఆఫర్ చెయ్యడంతో జూలై 1న ఖమ్మం జిల్లా చింతిర్యాల క్రాస్ రోడ్ అశ్వాపురానికి చెందిన సందీప్ అనే యువకుడు ఓఎల్ఎక్స్లో రెడ్మీ నోట్ప్రో స్మార్ట్ఫోన్ను రూ.7వేలకు పేటీఎం ద్వారా అవతలి వ్యక్తికి నగదును పంపాడు. మూడు రోజులు దాటినా మొబైల్ రాకపోవడంతో అనుమానం వేసి విక్రేత నెంబర్కు డయల్ చేశాడు. అవతలి నుంచి ‘స్విచాఫ్’ అని సమాధానం రావడంతో మోసపోయానని గ్రహించిన సందీప్ స్థానిక పోలీసులను ఆశ్రయించాడు.
మోసపోయిన వ్యక్తి నుండి కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు ఓఎల్ఎక్స్ యాప్ ద్వారా మోసం చేసిన వ్యక్తి అకౌంట్ నెంబర్ను ట్రాక్ చేసి అతని డబ్బులను బాధితుడు సందీప్ అకౌంట్లో జమ చేశారు. అంతే కాకుండా నేరానికి పాల్పడిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్ను సీజ్ చేయించినట్లు సీఐ అబ్బయ్య తెలిపారు. నగదు కోల్పోయిన యువకుడికి న్యాయం చేసిన సైబర్ క్రైం సిబ్బందిని ఎస్పీ సునీల్ దత్ అభినందించారు. ఇలాంటి సంఘటనలు చాలా చోటుచేసుకుంటున్నాయి. కొందరైతే ఏమి చెయ్యాలో తెలియక మోసానికి గురైన డబ్బులను పోగొట్టుకుని మానసిక క్షోభకు గురవుతున్నారు. ఇకమీదటైనా ఇలాంటి మోసాలకు లోనుకాకుండా యువకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.