ఐపీయల్ కు ముందు సన్నాహక మ్యాచ్ లు !
By: Sankar Wed, 02 Sept 2020 08:36 AM
ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభానికి సమయం సమీపిస్తున్నది. ఈనెల 19న మొదలవ్వాల్సిన టోర్నీ కోసం భారత ఆటగాళ్లతో పాటు కొందరు విదేశీ ప్లేయర్లు యూఏఈ చేరుకున్నారు. క్వారంటైన్ ముగించుకొని కొన్ని జట్ల ఆటగాళ్లు ఇప్పటికే తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
అయితే కరోనా వైరస్ వల్ల దాదాపు నాలుగు నెలలకు పైగా ఆటకు దూరంగా ఉన్న క్రికెటర్లు నేరుగా యూఏఈ వచ్చేశారు. దీంతో ప్లేయర్ల సంసిద్ధత కోసం ప్రధాన టోర్నీ కంటే ముందు జట్ల మధ్య కొన్ని వార్మప్ మ్యాచ్లు నిర్వహిస్తే మంచిదని ఫ్రాంచైజీలు అనుకుంటున్నట్టు సమాచారం. సన్నాహక పోటీల వల్ల పరిస్థితులకు ప్లేయర్లు కూడా అలవాటు పడతారని యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఐపీఎల్ బ్రాడ్కాస్టర్ స్టార్ ఇండియా సైతం ఇందుకు సుముఖంగా ఉంది. అయితే ఈ విషయంపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
‘టోర్నీకి ముందు వార్మప్ మ్యాచ్లు నిర్వహించడం చాలా మంచిది. ఇలా చేస్తే ప్రధాన టోర్నీకి ప్లేయర్లు పూర్తిగా సన్నద్ధమయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది’ అని ఓ ఫ్రాంచైజీకి చెందిన అధికారి చెప్పారు. మరిన్ని జట్ల యాజమాన్యాలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. అయితే వార్మప్ మ్యాచ్ల నిర్వహణపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఈ పరిస్థితుల్లో అసలు సన్నాహక మ్యాచ్లు సాధ్యమవుతాయా అన్న విషయంపై చర్చ జరుగాల్సి ఉంది. కాగా ఐపీఎల్ తుది షెడ్యూల్ రూపకల్పన కోసం బీసీసీఐ ఇంకా తర్జనభర్జన పడుతూనే ఉంది.