Advertisement

ట్రంప్ పై ఫౌచీ ఘాటు విమర్శలు...

By: chandrasekar Mon, 02 Nov 2020 7:07 PM

ట్రంప్ పై ఫౌచీ ఘాటు విమర్శలు...


కరోనా వైరస్ మహమ్మారి ఉద్ధృతిపై అమెరికా దేశ అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌచీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తీసుకుంటున్న చర్యలపై ఆయన పెదవి విరిచారు. వీలైనంత త్వరగా ప్రజారోగ్య విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉందని ఫౌచీ అభిప్రాయపడ్డారు. ఎన్నికల ముందు రోజే ఫౌచీ ఈ వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. వాష్టింగ్టన్ పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే గడ్డు పరిస్థితుల్లోకి జారుకున్నామని ఇది ఏమాత్రం మంచిది కాదని ఫౌచీ హెచ్చరించారు. వర్షాకాలం నుంచి శీతాకాలంలోకి వెళుతున్న కొద్దీ ప్రజలు ఇళ్లలోనే ఉండాల్సి ఉంటుందని ఇలాంటి తరుణంలో కరోనా వ్యాప్తి మరింత దయనీయంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ప్రజారోగ్య విధానాల్ని వెంటనే మార్చాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. త్వరలో రోజుకి లక్షకుపైగా కేసులు, మరిన్ని ఎక్కువ మరణాలు చోటుచేసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. డెమొక్రాటిక్‌ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ ప్రచారం ప్రజారోగ్య కోణాన్ని దృష్టిలో ఉంచుకుని సాగుతోందని ఫౌచీ అభిప్రాయపడ్డారు. ట్రంప్‌ మాత్రం ఆర్థిక వ్యవస్థ, దేశాన్ని కరోనాకు ముందున్న పరిస్థితికి తీసుకెళ్లడంపైనే దృష్టి సారించారన్నారు. మహమ్మారి విజృంభణను ట్రంప్‌ పాలకవర్గం నియంత్రించలేదని బహిరంగంగా అంగీకరించిన వైట్‌హౌస్ చీఫ్‌ ఆఫ్‌ స్టాప్‌ మార్క్‌ మీడోస్‌ను ఫౌచీ అభినందించారు.

కానీ, ఫౌచీ వ్యాఖ్యలను వైట్‌హౌస్ అధికార ప్రతినిధి జడ్‌ డీర్‌ ఖండించారు. ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఫౌచీ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మహమ్మారి నియంత్రణకు సూచనలు చేయాల్సింది పోయి ఎన్నికలకు రెండు రోజుల ముందే అధ్యక్షుడిపై విమర్శలు గుప్పించడం ఆయన రాజకీయపరమైన ఉద్దేశాల్ని బహిర్గతం చేస్తోందని దుయ్యబట్టారు. మిచిగాన్ ఎన్నికల ప్రచారంలో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బిడెన్‌పై విమర్శలు గుప్పించిన ట్రంప్.. చాలా మంది వైద్యులు స్వలాభం కోసం వైరస్ మరణాల సంఖ్యను పెంచుతున్నారని ఆరోపించారు. కాగా, అంతా అనుకున్నట్టు జరిగితే డిసెంబరు చివరి లేదా జనవరి తొలి నాళ్లలో ప్రభావంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఇటీవల ఫౌచీ వెల్లడించిన విషయం తెలిసిందే.

Tags :
|

Advertisement