సమతా పార్టీ మాజీ అధ్యక్షురాలు జయా జైట్లీకి నాలుగేళ్ల జైలు శిక్ష
By: chandrasekar Fri, 31 July 2020 10:55 AM
రక్షణ శాఖ ఒప్పందంలో
వెస్టండ్ ఇంటర్నేషనల్ ప్రతినిధి నుంచి లంచం తీసుకున్నట్లు రుజువుకావడంతో జయా
జైట్లీకి నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. అవినీతి ఆరోపణల కేసులో సమతా పార్టీ మాజీ
అధ్యక్షురాలు జయా జైట్లీకి ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష
విధించింది. అయితే ఆ తర్వాత కొద్ది గంటలకే ఢిల్లీ హైకోర్టు దీనిపై స్టే
విధించింది. సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును జయా హైకోర్టులో సవాల్ చేయడంతో
న్యాయస్థానం సీబీఐ స్పందన కోరింది. అంతకుముందు,ఆమెతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరికి కూడా
సీబీఐ కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది.
దోషులకు రూ.1లక్ష
చొప్పున జరిమానాను కూడా విధించింది. 2001లో జరిగిన రక్షణ శాఖ ఒప్పందంలో వెస్టండ్ ఇంటర్నేషనల్
ప్రతినిధి నుంచి జయా జైట్లీ రూ.2లక్షలు లంచంగా తీసుకున్నట్లు రుజువైంది. జయా జైట్లీతో
పాటు సమతా పార్టీ నేత గోపాల్ పచేర్వాల్,మాజీ సైనికాధికారి మేజర్ జనరల్ ముర్గాయిలను కోర్టు
దోషులుగా తేల్చింది. అప్పట్లో ఈ అవినీతిని ఆపరేషన్ వెస్టెండ్ పేరుతో తెహెల్కా
బయటపెట్టింది. మాథ్యూ శామ్యూల్ అనే వ్యక్తి నుంచి జయా జైట్లీకి రూ.2
లక్షలు ముడుపులు ముట్టినట్లు కోర్టు నిర్దారించింది.
అదేవిధంగా ముర్గయ్కి రూ.20 వేలు
ముడుపులు ముట్టినట్లు నిర్దారించింది. వెస్టెండ్ ఇంటర్నేషనల్ అనే ఓ కంపెనీకి ఆర్మీ
థర్మల్ ఇమేజర్స్ సప్లై ఆర్డర్స్ ఇచ్చేందుకు ఈ డీల్ కుదిరింది. వ్యక్తిగత
పలుకుబడిని ఉపయోగించి ఆ కంపెనీకి ఆర్మీ డీల్ కుదిర్చేందుకు జయా జైట్లీ
ప్రయత్నించిట్లు రుజువైంది. డిసెంబర్ 25,2000న ఈ డీల్ కోసం ఓ హోటల్ రూమ్లో ముర్గయ్ శామ్యూల్తో
భేటీ అయ్యారని తెలియజేసింది.