కూతురు పుట్టిందని మామని కత్తితో పొడిచేసిన అల్లుడు
By: chandrasekar Sat, 30 May 2020 5:03 PM
అన్నయప్ప కుమార్తె తో
మంజునాథ్కి వివాహమైంది. మూడు నెలల కిందట ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మగపిల్లాడు
పుడతాడని ఆశించిన అత్తింటి వారికి నిరాశ. ఆడపిల్ల పుట్టిందని భార్య తండ్రిని
పొడిచేశాడో ప్రబుద్ధుడు. బెంగళూరులోని బొమ్మనహళ్లి ప్రాంతానికి చెందిన అన్నయప్ప
కుమార్తె మూడు నెలల కిందట ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
మగపిల్లాడు పుడతాడని
ఆశపడిన ఆమె భర్త మంజునాథ్, అతని కుటుంబ సభ్యులు నిరాశకు గురయ్యారు. అప్పటి నుంచి
భార్యతో.. ఆమె కుటుంబ సభ్యులతో మంజునాథ్ చీటికీమాటికీ గొడవపడుతున్నాడు.ఇరుకుటుంబాల
మధ్య గొడవలు సద్దుమణిగేలా కూర్చుని మాట్లాడుకుందామంటూ అన్నయప్ప అల్లుడి ఇంటికి
వెళ్లాడు. తన ఇద్దరు కొడుకులు, పెద్ద అల్లుడితో కలసి చిన్న అల్లుడు మంజునాథ్ ఇంటికి
వెళ్లారు. అల్లుడి కుటుంబం తరఫున మంజునాథ్ అన్నయ్య శ్రీనివాస్, అతని
స్నేహితుడు మాట్లాడేందుకు వచ్చారు.
ఇరువర్గాల మధ్య మాటామాటా
పెరగడంతో కోపంతో ఊగిపోయిన అల్లుడు మామ అన్నయప్పని కత్తితో పొడిచేశాడు. ఆయనకు
తీవ్రగాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. తనపై హత్యాయత్నం చేశారంటూ బాధితుడు
అన్నయప్ప పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అల్లుడు మంజునాథ్, అతని
తండ్రి నారాయణప్ప, అన్న శ్రీనివాస్, అతని స్నేహితుడు శాంతకుమారపై కేసు నమోదు చేశారు.
సెక్షన్ 324, 504, 506 కింద కేసులు నమోదయ్యాయి. పోలీసులు విచారణ
జరుపుతున్నారు.