హుస్సేన్ సాగర్ లో భారీగా వరద నీరు ..
By: Sankar Tue, 20 Oct 2020 1:06 PM
హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. హుస్సేన్ సాగర్ జలాశయంలోకి 1,560 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో తూముల ద్వారా 2,098 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 513.67 మీటర్లకు చేరింది.
హైదరాబాద్ నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లాల్లో రిజర్వాయర్ల వద్ద ఉన్న పర్యాటక శాఖ బోట్లను ప్రభుత్వం తెప్పించింది. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు బోట్లను ప్రభుత్వం సిద్ధం చేసింది.
మొత్తం 53 బోట్లను హైదరాబాద్కు తెప్పించింది. రాష్ర్ట ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు 5 బోట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపింది. వర్షాభావ ప్రాంతాల్లో బోట్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచనుంది.కాగా హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ ప్రకటించారు. నగర ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావొద్దని ఆయన హెచ్చరించారు. రోడ్లపై నీరు నిల్వకుండా డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేశామని తెలిపారు.