Advertisement

  • టిక్ టాక్ మోజులో పడి ఇంటి నుంచి పారిపోయిన ఐదుగురు యువకులు

టిక్ టాక్ మోజులో పడి ఇంటి నుంచి పారిపోయిన ఐదుగురు యువకులు

By: chandrasekar Mon, 22 June 2020 5:39 PM

టిక్ టాక్ మోజులో పడి ఇంటి నుంచి పారిపోయిన ఐదుగురు యువకులు


తూర్పు గోదావరి జిల్లా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరం ఎస్సై ఎన్‌.సతీష్‌బాబు శనివారం కేసు నమోదు చేశారు. టిక్‌ టాక్‌ పిచ్చి కొందరికి పీక్స్‌కు చేరింది. టిక్ టాక్ మోజులో పడి ఐదుగురు యువకులు ఏకంగా ఇంటి నుంచి పారిపోయారు.

అమలాపురం డీఎస్పీ షేక్‌ మాసుమ్‌ బాషా తెలిపిన వివరాల ప్రకారం మామిడికుదురు, నగరం గ్రామాలకు చెందిన నలుగురు, కాకినాడకు చెందిన మరో యువకుడితో కలిసి శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఇంటి నుంచి పారిపోయారు. వీరంతా రెండు బైక్‌లపై వెళ్లి పోయారని గుర్తించారు.

వీరంతా టిక్‌ టాక్‌ వీడియోలు చేస్తూ స్నేహితులయ్యారని తెలుస్తోంది. అయితే వీరంతా ఎక్కడకు వెళ్లారన్నది మిస్టరీగా మారింది.

ఓ యువకుడు రాసిన లెటర్‌లో తాము డబ్బు సంపాదన కోసం వెళ్తున్నామని, తమ కోసం ఎవరూ ఆందోళన చెందవద్దని, తమ తల్లితండ్రులను బాగా చూసుకోవాలని కోరాడు. అదృశ్యమైన వారిలో 16 ఏళ్ల వారు ముగ్గురు, 18 ఏళ్ల వారు ఇద్దరు ఉన్నారు. డీఎస్పీ మాసుమ్‌ బాషా, రాజోలు సీఐ దుర్గాశేఖర్‌ రెడ్డి, నగరం ఎస్సై ఎన్‌.సతీష్‌బాబు తదితరులు ఆ యువకుల కుటుంబ సభ్యులను విచారణ చేసి వివరాలు సేకరించారు.

ఆ యువకుల బృందం విశాఖపట్నం వెళ్లినట్లుగా సమాచారం రావడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టిక్‌టాక్‌ మోజులో పడి ఈ యువకులు వెళ్లిపోయారని గుర్తించామని డీఎస్పీ మాసుమ్‌ బాషా విలేకర్లకు తెలిపారు. ఐదుగురు యువకుల మిస్సింగ్‌ కేసును పోలీసులు చేధించారు. అదృశ్యమైన యువకులంతా ప్రస్తుతం మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌లో ఉన్నట్లు సమాచారం. వీరిని అక్కడనుంచి తీసుకురావడానికి పోలీసులు నగరం నుంచి మంగళగిరి బయల్దేరి వెళ్లారు.

Tags :
|
|

Advertisement