నిద్రలోనే ఐదుగురు సజీవదహనం
By: Dimple Sat, 05 Sept 2020 09:08 AM
నిద్రలోనే ఐదుగురు సజీవదహనమయ్యారు. తమిళనాడులోని సేలం సమీపంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనమయ్యారు.
సేలం కురంగుచావడి సమీపం నగరమలై పిళ్లయారు ఆలయం వీధికి చెందిన సేట్టు అలియాస్ బాలన్ (75), అముద (66) దంపతులు..కుమారులు అన్బళగన్ (43), కార్తిక్ (40) కుటుంబాలతో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు.
రాత్రి నిద్రపోయాక వీరి ఇంటి నుంచి అద్దాలు పగిలి శబ్దాలు రావడంతో ఇరుగుపొరుగు అక్కడికి వచ్చారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చాక లోనికి ప్రవేశించారు.
ఈ ప్రమాదంలో కార్తిక్, అతని భార్య మహేశ్వరి(35), కుమారులు సర్వేష్(12), ముఖేష్(10).. అన్బగళన్ భార్య పుష్ప(40) సజీవ దహనమైనట్లు గుర్తించారు.
మిగిలిన వారు తమ గదులకు అనుసంధానించి ఉన్న బాత్రూముల్లోకి వెళ్లి గడియపెట్టి ప్రాణాలు దక్కించుకున్నారు. విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు.