దేశంలో తొలి సారి ముప్పై వేలు దాటిన ఒక్కరోజు కరోనా పాజిటివ్ కేసులు ..
By: Sankar Thu, 16 July 2020 3:16 PM
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. గత పది రోజులుగా 25 నుంచి 29 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా, మొదటిసారిగా 30 వేల మార్కును దాటాయి. అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య అధికమవుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 32,695 పాజిటివ్ కేసులు నమోదవగా, 606 మంది మరణించారు.
ఇప్పటివరకు దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,68,876కు చేరింది. ఇందులో 6,12,815 మంది బాధితులు కోలుకోగా, 3,31,146 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. అదేవిధంగా దేశంలో కరోనా బారినపడినవారిలో 24,915 మంది బాధితులు మరణించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.
దేశంలో నిన్న ఒకేరోజు 3,26,826 మందికి కరోనా పరీక్షలు చేశామని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎమ్మార్) ప్రకటించింది. దేశవ్యాప్తంగా జూలై 15 వరకు 1,27,39,490 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది.