తొలిరోజు వరుణుడు గెల్చుకున్నాడు ..
By: Sankar Thu, 09 July 2020 06:13 AM
ఇంగ్లాండ్ , వెస్ట్ ఇండీస్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ అనగానే క్రికెట్ అభిమానులు అందరు ఎంతో ఆసక్తిని కనబరిచారు ..అసలు ఏ స్థాయిలో అయినా క్రికెట్ మ్యాచ్ అనేది లేక దాదాపు నాలుగు నెలలు అవుతుంది ..దీనితో ఎప్పుడెప్పుడు క్రికెట్ మ్యాచ్ లు మొదలువుతాయ అని ఎదురు చుసిన అభిమానులకు ఇంగ్లాండ్ , వెస్ట్ ఇండీస్ సిరీస్ ఎడారిలో ఒయాసిస్ లాగ కనిపించింది ..అయితే మనం ఒకటి తలిస్తే దేవుడు ఇంకోటి తలిచాడు అన్నట్లు ..
నిన్న జరిగిన ఫస్ట్ టెస్ట్ ఫస్ట్ రోజును వరుణుడు గెలుచుకున్నాడు ..కేవలం 17.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం అయింది..తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్లో 17.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. రోరీ బర్న్స్ (55 బంతుల్లో 20 బ్యాటింగ్; 3 ఫోర్లు), డెన్లీ (48 బంతుల్లో 14 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజ్లో ఉన్నారు. కేవలం 82 నిమిషాల ఆట మాత్రమే సాగింది. రెండో రోజు శుక్రవారం కూడా వర్ష సూచన ఉంది.
తొలి టెస్టు ఆరంభమే ఆలస్యమైంది. ఉదయం నుంచి వర్షం కురవడంతో మ్యాచ్ మొదలు కాలేదు. చివరకు సరిగ్గా 3 గంటలు ఆలస్యంగా... భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు తొలి బంతి పడింది. సరిగ్గా 3 ఓవర్లు సాగగానే వర్షంతో ఆట ఆగిపోయింది. వాన తగ్గాక మళ్లీ ఆడితే 7 బంతుల తర్వాతే మళ్లీ చినుకులతో బ్రేక్ పడింది. కొంత విరామం తర్వాత మొదలైన ఆట 13.3 ఓవర్ల పాటు సాగింది. అంతా బాగుందనుకున్న సమయంలో వెలుతురులేమితో మ్యాచ్ ఆపేయాల్సి వచ్చింది. కొద్ది నిమిషాల్లోనే మరోసారి వర్షం వచ్చింది. ఆ తర్వాత వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ను అంపైర్లు నిలిపివేయక తప్పలేదు.
అమెరికా నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి సంతాపసూచకంగా మ్యాచ్లో తొలి బంతిని వేయడానికి ముందు ఇంగ్లండ్, వెస్టిండీస్ ఆటగాళ్లు మోకాలిపై కూర్చొని నిరసనను ప్రదర్శించారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా వీరందరూ ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ లోగో ముద్రించి ఉన్న జెర్సీలతో బరిలోకి దిగారు. ఇటీవలే కన్నుమూసిన విండీస్ దిగ్గజ క్రికెటర్ ఎవర్టన్ వీక్స్తో పాటు ప్రపంచవ్యాప్తంగా మృతి చెందిన కరోనా బాధితుల స్మృతిలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. భుజానికి నల్ల బ్యాండ్లు ధరించారు.