కిమ్ ఇలాఖా ఉత్తర కొరియాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు ..
By: Sankar Sun, 26 July 2020 12:18 PM
ప్రపంచం మొత్తం కరోనా దాటికి అల్లాడుతుంటే , చైనా పక్కనే ఉన్న ఉత్తర కొరియా మాత్రం ఇప్పటివరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు అని గర్వంగా చెప్పుకుంటూ ఉంది ..అయితే ఇక నుంచి ఉత్తర కొరియా ఆలా చెప్పుకునే వీలు లేదు ..ఎందుకంటే తాజాగా ఉత్తర కొరియాలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది ..దక్షిణ సరిహద్దు ప్రాంతమైన కైసోంగ్ నగరంలో అధికారికంగా మొదటి పాజిటివ్ కేసు నిర్ధారణ అయిందని అక్కడి అధికారిక మీడియా తెలిపింది. తాజాగా కైసోంగ్ నగరంలో కరోనా లక్షణాలతో ఓ వ్యక్తి ఆస్పత్రిలో చేరినట్లు వెల్లడించింది. దీంతో ఉత్తర కొరియా దేశాధ్యక్షుడు కిమ్జోంగ్ ఉన్ సరిహద్దులను మూసివేయమని చెప్పడమే కాకుండా కైసోంగ్లో కఠిన లాక్డౌన్ విధించినట్లు అక్కడి అధికారిక మీడియా వెల్లడించింది.
మూడేండ్ల క్రితం దక్షిణకొరియాకు పారిపోయిన ఓ ఫిరాయింపుదారుడు జూలై 19న దేశ సరిహద్దును చట్టవిరుద్ధంగా దాటి వచ్చాడని, ఇప్పుడు అతనికే కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని నార్త్ కొరియన్ మీడియా తెలిపింది. అయితే దక్షిణకొరియా మాత్రం సరిహద్దుల్లో అలాంటి ఘటన ఏం జరుగలేదని స్పష్టంచేసింది. ప్రస్తుతం కరోనా బాధితుడు క్వారంటైన్లో ఉండగా వైద్యులు అతన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
అటు గడిచిన కొద్దిరోజుల్లో అతడు ఎక్కడెక్కడికి తిరిగాడు? ఎవరిని కలిశాడు? అనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. వారందరిని కూడా క్వారెంటైన్కు తరలించాలని కిమ్ ఆదేశించినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటివరకు తమదేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని చెప్పుకొచ్చిన కిమ్.. తాజాగా నమోదైన పాజిటివ్ కేసుతో అధికారులకు కీలక ఆదేశాలు జారీచేశాడు. 'కరోనా వైరస్ దేశంలోకి ప్రవేశించింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే పెద్ద ప్రమాదంలో పడతాం. బోర్డర్ల వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి' అని ఆదేశించారు.