విజయవాడలో ఘోర అగ్ని ప్రమాదం ..పదకొండుకు చేరిన మృతుల సంఖ్య
By: Sankar Sun, 09 Aug 2020 11:25 AM
విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రి కోవిడ్కేర్ సెంటర్గా ఉపయోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హోటల్లో 50 మంది కరోనా పేషెంట్లకు ప్రభుత్వం చికిత్స అందిస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే హోటల్ సిబ్బంది అలర్ట్ కావడంతో ప్రాణనష్టం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు విస్తృతంగా వ్యాపించాయి. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద కారణాలపై ఆరా తీశారు. ఘటన వివరాలను సీఎంఓ అధికారులు సీఎం వైఎస్ జగన్కు వివరించారు. ఒక ప్రైవేటు ఆస్పత్రి ఈ హోటల్ను లీజుకు తీసుకొని, అందులో కరోనా వైరస్ సోకిన పేషెంట్లను ఉంచారు
వారికీ చికిత్స అందిస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైందని సీఎంఓ అధికారులు సీఎంకు వెల్లడించారు. ఈ ప్రమాదానికి గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. ఘటనపై లోతుగా విచారణ జరపాలని, ఘటన పూర్వాపరాలను తనకు నివేదించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు సీఎం వైఎస్ జగన్ రూ.50లక్షల పరిహారం ప్రకటించారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు
అయితే ప్రమాదంలో మృతుల సంఖ్య పదకొండుకు చేరుకుంది. ప్రమాద ఘటనపై కలెక్టర్ మాట్లాడుతూ.. స్పాట్లో ఏడుగురు మృత్యువాత పడగా, ఆస్పత్రిలో నలుగురు ప్రాణాలు వదిలారు. మరో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చెందిన కోవిడ్ కేర్ సెంటర్ను స్వర్ణపాలెస్లో నిర్వహిస్తున్నారు. ప్రమాద ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేస్తున్నామని కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు.