ఎయిర్పోర్టులో అగ్నిప్రమాదం.. టికెట్ కౌంటర్ దగ్ధం...!
By: Anji Thu, 29 Oct 2020 2:15 PM
జమ్ముకశ్మీర్లోని జమ్ము ఎయిర్పోర్ట్లో పెను ప్రమాదం తప్పింది. ఇవాళ తెల్లవారుజామున విమానాశ్రయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు అంటుకున్న మంటలతో ఎయిర్పోర్టులోని టికెట్ కౌంటర్లు అగ్నికి ఆహుతయ్యాయి.
ఈరోజు ఉదయం 3 గంటల ప్రాంతంలో ఓ టికెట్ కౌంటర్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని, అవి మిగిలినవాటికి వ్యాపించాయని అధికారులు తెలిపారు. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
మంటలను ఆర్పడానికి 45 నిమిషాల సమయం పట్టిందని సత్వారీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ ప్రమాదానికి షార్ట్సర్క్కూట్ కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఒక్కరుకూడా గాయపడలేదని చెప్పారు.
ఈ ఘటనపై ఎయిర్పోర్టు అధికారులు స్పందించారు. టికెట్ కౌంటర్లో మంటలు చెలరేగాయని, గంట వ్యవధిలోనే అవి అదుపులోకి వచ్చాయని జమ్ము ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ప్రవంత్ రంజన్ తెలిపారు.
అయితే, విమాన సర్వీలకు ఎలాంటి అంతరాయం కలుగలేదని, సర్వీసులను యదావిధంగా నడిపామని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. కేసు నమోదు చేసుకున్న సత్వారీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.