ఏపీలో మరొక ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం..ఆందోళనలో రోగులు
By: Sankar Wed, 26 Aug 2020 10:43 AM
విజయవాడ లోని స్వర్ణ ప్యాలస్ లోని కరోనా వార్డ్ లో షార్ట్ సర్క్యూట్ కావడంతో కరోనా రోగులు మరణించిన విషయం మరవకముందే ఏపీలోని మరొక ఆసుపత్రిలో కరోనా వార్డ్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. రాత్రి 12 గంటల సమయంలో కొవిడ్ వార్డులో ఉన్న రికార్డు రూమ్లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి.
ఆ రికార్డు రూమ్ పక్కనే 24 మంది కొవిడ్ బాధితులు ఉన్నారు.. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ముందస్తు జాగ్రత్తగా రోగుల్ని నుంచి అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.
అగ్నిప్రమాదం గురించి తెలియగానే అసిస్టెంట్ కలెక్టర్ సూర్య, జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు, అనంతపురం ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే కొవిడ్ వార్డులోని బాధితులను మరో వార్డుకు తరలించామని అధికారులు తెలిపారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, మంటలు వ్యాపించకుండా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకున్నామన్నారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి.