బీజేపీ పై ధ్వజమెత్తిన ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు
By: chandrasekar Mon, 19 Oct 2020 10:01 AM
బీజేపీ పై ఆర్థికశాఖ
మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. ఆదివారం దుబ్బాక రెడ్డి ఫంక్షన్ హాలులో పలువురు
బీజేపీ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీడీ
కార్మికులకు రూ.1600 ఇస్తున్నట్లు బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారని, 16 పైసలు
కార్మికులకు నరేంద్ర మోదీ ఇస్తున్నట్లు ఆధారాలు చూపాలని మంత్రి డిమాండ్ చేశారు.
తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్లు తెలిపారు.
బీజేపీ ప్రభుత్వం గుజరాత్
సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీడీ కార్మికులకు ఎందుకు ఇవ్వడం లేదని
ప్రశ్నించారు. అబద్ధాలతో అధికారంలోకి బీజేపీ రావాలనుకుంటే అది ఎండమావేనని, యూపీలో
వృద్ధులకు, వితంతువులకు బీజేపీ రూ.500
ఇస్తుందని పేర్కొన్నారు. అలాగే కర్ణాటకలో రూ.400 పెన్షన్ బీజేపీ ప్రభుత్వం ఇస్తుందని, తెలంగాణలో
రూ.2వేలు
ఇస్తున్నట్లు గుర్తు చేశారు. బీజేపీవి అన్నీ దోకాబాజీ మాటలేనన్నారు. కాంగ్రెస్
అధికారంలో ఉన్న రాజస్థాన్లో రూ.500 మాత్రమే పింఛన్ ఇస్తున్నారని, రూ.2వేల
పింఛన్ ఇచ్చే టీఆర్స్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్, బీజేపీ ఎలా
విమర్శిస్తున్నాయని ప్రశ్నించారు.
ప్రస్తుతం యూపీలో బోర్లు, బావులదగ్గర యూనిట్ రూ.4 చొప్పున రైతుల నుంచి
చార్జీలు వసూలు చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజల సంక్షేమానికి
పథకాలు అమలు చేస్తుందన్నారు. త్వరలో జరుగబోయే దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్
అభ్యర్థి సోలిపేట సుజాత గెలుపు ఖాయమన్నారు. ఆమె గెలుపునకు కార్యకర్తలు కృషి
చేయాలని సూచించారు. టీఆర్ఎస్ చేస్తున్న
అభివృద్ధి కార్యక్రమాల వల్ల గెలుపు మాదే అని ధీమా వ్యక్తపరిచారు.