కరోనా అనుమానంతో ఎవరు ముందుకు రాకపోవడంతో సైకిల్ మీద శవాన్ని తీసుకుపోయిన బంధువులు
By: Sankar Tue, 18 Aug 2020 1:22 PM
కరోనా మహమ్మారి దెబ్బకు మానవ సంబంధాలు అత్యంత దారుణంగా దెబ్బతిన్నాయి..కరోనా అంటువ్యాధి కావడంతో కరోనా వచ్చిన వారికి దగ్గర్లో ఉండటానికి కూడా జనం భయపడుతున్నారు..ఇక ఎవరైనా కరోనా కారణంగా చనిపోతే అంతే సంగతి. సొంత ఫామిలీ సభ్యులు కూడా చనిపోయిన శవాన్ని తీసుకుపోవడానికి ముందుకు రావడం లేదు.
ఇదివరకు మనిషి చనిపోతే పెండ్లి చేసినంత ఘనంగా శవాన్ని ఊరేగిస్తూ స్మశాన వాటికకు తరలించేవాళ్లు. ఇప్పుడు అలాంటి ఆనవాళ్లు ఏవీ కనిపించడం లేదు. కనీసం శవం దగ్గర మనుషులు కూడా కనిపించడం లేదు. అనారోగ్యంతో మరణించినా వారికి కరోనా ఉందనే అనుమానంతో ఇరుగుపొరుగు వాళ్లు కూడా రావడం మానేశారు. ఇలాంటి సంఘటనలు రోజూ చూస్తున్నప్పటికీ ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యం కన్నీరు పెట్టిస్తున్నది.
కర్ణాటకలోని బెలగవీ జిల్లా కిత్తూర్లో చోటుచేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఓ వ్యక్తి ఆనారోగ్యంతో మరణించాడు. అయితే అతనికి అంత్యక్రియలు జరపడానికి కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాలేదు. దీంతో వారే శవాన్ని కవర్లో చుట్టి సైకిల్ మీద స్మశానవాటిక వరకూ తీసుకెళ్లారు. జోరు వర్షం వీరి బాధను ఎదుటివారికి కనిపించకుండా చేసింది. ఆ తర్వాత అంత్యక్రియలు జరిపారు. కరోనా రాకతో జాగ్రత్తలు ఎక్కువయ్యాయి కాని బంధాలు తెగిపోతున్నాయి.