- హోమ్›
- వార్తలు›
- విద్వేషపూరిత ప్రసంగాలను చేస్తున్నాడు అని రాజాసింగ్ ఫేస్ బుక్ అకౌంట్ బ్యాన్ చేసిన ఫేస్ బుక్
విద్వేషపూరిత ప్రసంగాలను చేస్తున్నాడు అని రాజాసింగ్ ఫేస్ బుక్ అకౌంట్ బ్యాన్ చేసిన ఫేస్ బుక్
By: Sankar Thu, 03 Sept 2020 4:33 PM
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై ఫేస్బుక్ నిషేధం విధించింది. ద్వేషపూరిత ప్రసంగాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఫేస్బుక్ నిబంధనల్ని ఉల్లంఘించిన కారణంగా నిషేదం విధిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు ఫేస్బుక్ ప్రతినిధి ఒకరు ఈ- మెయిల్ ద్వారా వెల్లడించారు. హింసను ప్రోత్సహించేలా వ్యాఖ్యలు చేస్తున్న కారణంగా రాజాసింగ్ ఫేస్బుక్ అకౌంట్ని తొలిగిస్తున్నామంటూ ప్రకటించారు. ఇదివరకే దీనికి సంబంధించి పలుసార్లు హెచ్చరించినా ఫేస్బుక్ నియమావళిని ఉల్లంఘించారని పేర్కొన్నారు.
మరోవైపు ఫేస్బుక్ నిషేదంపై స్పందించిన రాజాసింగ్ తనకు అధికారికంగా ఇంతవరకు ఎలాంటి ఫేస్బుక్ అకౌంట్ లేదని, తన పేరుతో ఉన్న నకిలీ అకౌంట్లకు తాను బాధ్యుడిని కానంటూ వివరణ ఇచ్చారు. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఖాతాదారులున్న ఫేస్బుక్ బీజేపీ నేతల విద్వేషపూరిత ప్రసంగాలను చూసీచూడనట్లుగా వదిలేస్తోందనే వాల్స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై నిషేధం ప్రాధాన్యత సంతరించుకుంది..
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తన ఖాతాలపై విధించిన బ్యాన్ పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తన పేరుతో ఉన్న అకౌంట్ లను బ్యాన్ చేయడం హర్షణీయం అని అన్నారు. కానీ విద్వేషపూరిత వ్యాఖ్యలు, ప్రసంగాలు చేస్తున్న ఎంఐఎం, కాంగ్రెస్ నేతల అకౌంట్లను సైతం పరిశీలించాలని ఆయా సంస్థలను కోరారు. అయితే తన పేరుతో ఉన్న పేజీలు తనవి కాకపోయినా.. అందులో చేసిన పోస్టులతో తాను ఏకీభవిస్తున్నట్టు పేర్కొన్నారు. తన ఫేస్బుక్ 2018 లో హ్యాక్ అయ్యిందని..తరవాత దాన్ని వాడేందుకు అనుమతివ్వలేదని తెలిపారు. అంతేకాకుండా తనకు ఒక కొత్త పేజీ తెరుచుకోవడానికి అనుమతివ్వాలని.. దాన్ని ఫేస్బుక్ విధానాలను ఉల్లంఘించకుండా ఉపయోగిస్తానని చెప్పారు.