ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ ..నిలకడగా ఆడుతున్న పాకిస్తాన్
By: Sankar Thu, 06 Aug 2020 10:41 AM
ఇంగ్లండ్ టూర్ను పాకిస్తాన్ ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. బుధవారం మొదలైన తొలి టెస్టులో పాక్ బ్యాట్స్మెన్ బాబర్ అజమ్, షాన్ మసూద్ ఆతిథ్య బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. దీంతో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ ఆట నిలిచే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 49 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. వెలుతురు మందగించడంతో ఆటను ముందుగానే నిలిపేయడంతో తొలిరోజు కనీసం 50 ఓవర్లయినా సాగలేదు.
బాబర్ (100 బంతుల్లో 69 బ్యాటింగ్; 11 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో నిలిచాడు. ఓపెనర్ షాన్ మసూద్ (152 బంతుల్లో 46 బ్యాటింగ్; 7 ఫోర్లు) రాణించడంతో ఇంగ్లండ్ బౌలర్లకు ఇబ్బందులు తప్పలేదు. అబిద్ అలీ (16)ని ఆర్చర్ క్లీన్బౌల్డ్ చేయగా... కెప్టెన్ అజార్ అలీ (0)ని వోక్స్ డకౌట్గా పంపాడు. దీంతో మసూద్, బాబర్ జాగ్రత్తగా ఆడి ఇన్నింగ్స్ను కుదుటపరిచారు. ఇద్దరు కలిసి అబేధ్యమైన మూడో వికెట్కు 96 పరుగులు జోడించారు.
కాగా కరోనా లాక్ డౌన్ తర్వాత ఇంగ్లాండ్ లో జరుగుతున్న మూడవ సిరీస్ ఇది ..ఇప్పటికే వెస్ట్ ఇండీస్ తో టెస్ట్ సిరీస్ లో తలపడిన ఇంగ్లాండ్ , ఆ తర్వాత ఐర్లాండ్ తో వన్ డే సిరీస్ లో పోటీపడింది ..అయితే మూడో వన్ డే లో ఇంగ్లాండ్ కు షాకిస్తూ ఐర్లాండ్ సంచలన విజయం సాధించింది ..